తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పెద్ద మార్పు కనిపిస్తోంది. నేతల మధ్య సమన్వయం పెరుగుతోంది. దీంతో పాటు.. ఇప్పటి వరకు పార్టీలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసిన ముఖ్యమంత్రి అభ్యర్థుల విషయంలో నేతలు కాస్త వెనక్కి తగ్గినట్టే కనిపిస్తోంది. ఈ పరిణామం మంచిదేనని అంటున్నారు విశ్లేషకులు. అత్యంత పాత పార్టీ అయిన కాంగ్రెస్లో నేతలందరూ సీనియర్లు కావడంతో తలెత్తిన పెద్ద వివాదం ఇటీవల కాలంలో ఒకింత పరిష్కారమైనట్టే కనిపిస్తోంది. విషయంలోకి వెళ్తే.. తెలంగాణ రాష్ట్రాన్ని మేమే ఇచ్చాం అంటూ.. పెద్ద ఎత్తున ప్రచారం చేసుకునే టీ-కాంగ్రెస్కు గత ఎన్నికల్లో చేదు అనుభవం ఎదురైంది. అప్పటి వరకు తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తానని ప్రకటించిన సీఎం కేసీఆర్.. మాట మార్చారు. అదంతా పాత ముచ్చట- అని కొట్టి పారేశారు. దీంతో కాంగ్రెస్ ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లింది. అయితే, అనూహ్యంగా ఘోర ఓటమిని చవి చూసింది.
ఈ పరిణామంతో ఖంగుతిన్న కాంగ్రెస్ నేతలు.. వచ్చే ఎన్నికల్లో అయినా పార్టీని విజయం తీరం వైపు నడిపించాలని, అధికారంలోకి తీసుకురావాలని నిర్ణయించారు. అయితే, అది అంత వీజీ కాని పరిస్థితిగా మారింది. రాష్ట్రంలో కేసీఆర్ తనదైన దూకుడుతో ముందుకు పోతున్నారు. ఆయనను నిలువరించడం అంటే మాటలు కాదు. పైగా తెలంగాణ సెంటిమెంట్ ఎక్కువగా ఉన్న నేత. అదేసమయంలో అన్ని వర్గాల వారికీ ఏదో ఒకటి అంటూ కార్యక్రమాలు చేపడుతున్నారు. బలమైన కేబినెట్ను ఏర్పాటు చేసుకున్నారు. మరి అలాంటి నేతను ఎదిరించి ఎన్నికల రంగంలో గెలుపు సాధించాలంటే.. కాంగ్రెస్కు మరింత వ్యూహం అవసరం. కానీ, మన నేతలు అందరూ సీనియర్లు కావడంతో ఎవరికి వారు పదవులపై దృష్టి పెట్టారు. జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఫైర్బ్రాండ్ డీకే అరుణ, గీతీరెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, దానం నాగేంద్ర ఇలా ఎవరికి వారే పెద్ద పెద్ద పదవులపై దృష్టి పెట్టారు.
అంతేకాదు, పెద్ద పదవుల్లో తమను తాము ఊహించుకుని క్షేత్రస్థాయిలో పనిచేయడం మానేశారు. ఇది పార్టీని మరింత ఇబ్బంది పెట్టింది. మరో ఏడాదిలో లేదా ఈ ఏడాది చివరి నాటికే ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ పరిణామం కాంగ్రెస్కు ఆత్మహత్యా సదృశంగానే మారింది. దీంతో ఈ విషయంపై ఇటీవల కాలంలో రాహుల్ అధ్యక్షుడు అయ్యాక.. తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది., అందరికీ పదవులు కావాలి.. నిజమే.. కానీ, దానికి తగిన విధంగా పనిచేయకపోతే.. పార్టీ అధికారంలోకి వచ్చేది ఎలా.. అంటూ రాహుల్ క్లాస్ తీసుకున్నట్టు సమాచారం. ఈ పరిణామం అందరిలోనూ మార్పు తెచ్చినట్టు తెలుస్తోంది. అధిష్టానానికి తమ మనసులోని కోరికలు తెలియాలి.. కానీ, యాంటీ వాతావరణం ఏర్పడితే.. అధిష్టానం ఆగ్రహిస్తే.. ఎలా అని భావించిన నేతలు ఇప్పుడు తమ మనసులకు బుద్ధి చెబుతున్నారట.
ఇకపై ప్రజల్లో ఉండాలని, కనీసం వచ్చే ఐదారు నెలల పాటు పార్టీ కోసం పనిచేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న కోమటిరెడ్డి అనూహ్యంగా మనసు మార్చుకున్నట్లు కనిపిస్తుంది. కోమటిరెడ్డి పూర్తిగా మారిపోయారు. 20మందికి పైగా రేసులో ఉన్న సీఎం ఆశావహుల లిస్టు నుంచి కోమటిరెడ్డి జారుకున్నట్లే అంటున్నారు. ఇక, జానా కూడా సైలెంట్ అయిపోయారు. డీకే ఇక ప్రజల్లో తిరగాలని భావిస్తున్నారు. ఇలా.. టీ కాంగ్రెస్లో అనూహ్యమైన మార్పు రావడంతో కేడర్లో కూడా ఉత్సాహం నింపుతున్నట్టు సమాచారం.