ఏపీ సీఎం చంద్రబాబు సన్నిహితులైన ఐఏఎస్ అధికారుకూ వైసీపీ నేత విజయసాయిరెడ్డికీ మధ్య వివాదం క్రమంగా ముదురుతోంది. ఏపీ సీఎం దగ్గర పనిచేసే కొందరు ఐఏఎస్ అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని.. వైసీపీ నేతలను ప్రలోభపెట్టి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారన్నది విజయసాయిరెడ్డి ఆరోపణ. దీనిపై ఐఏఎస్ అధికారులు మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ ఓ లేఖ కూడా విడుదల చేశారు.
విజయసాయిరెడ్డి విమర్శలపై తెలుగు దేశంనేతలు కూడా మండిపడుతున్నారు. విజయసాయిరెడ్డిపై కేసు నమోదు చేయాలని డీజీపీకి ఎంపీ రాయపాటి సాంబశివరావు లేఖ కూడా రాశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించినందున కేసు నమోదు చేయాలని లేఖలో రాయపాటి కోరారు. వైసీపీ నేతల బెదిరింపులకు ఇది పరాకాష్ఠని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కామెంట్ చేశారు. ఇలా బెదిరించడం వల్లే...గత ఎన్నికల్లో ప్రజలు వైసీపీని పక్కనబెట్టారని మంత్రి ఆరోపించారు.
ఐతే.. విజయసాయిరెడ్డి మాత్రం తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానన్నారు. అంతే కాదు.. ఏకంగా ఐఏఎస్ లకు మళ్లీ సవాల్ విసిరారు. రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్న నలుగురు ఆల్ ఇండియా సర్వీస్ అధికారులపై తక్షణమే చర్య తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను టీడీపీ నేతలతో కలిసి ప్రలోభాలకు గురి చేస్తూ.. పెద్ద మొత్తంలో లంచాలు ఇవ్వజూపుతూ అనైతికంగా వ్యవహరిస్తున్నారని విజయసాయి రెడ్డి పునరుద్ఘాటించారు.
ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయంలో పని చేస్తున్న ఐఏఎస్ అధికారి సతీష్ చంద్ర, మరో ఇద్దరు ఐఏఎస్ అధికారులు రాజమౌళి, సాయిప్రసాద్ తో పాటు ఐపీఎస్ అధికారి ఇంటలిజెన్స్ అడిషనల్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావుల వ్యవహార శైలిని విజయసాయిరెడ్డి తప్పుబట్టారు. ఇటీవలి పార్టీ ఫిరాయింపుల్లో వీరి ప్రమేయం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఉందన్నారు. కావాలంటే తాను ఆధారాలు కూడా బయటపెడతానన్నారు.