చెప్పేవి శ్రీరంగ నీతులు..దూరేది ఆ...గుడిసెలు అన్న సామెత గుర్తుంది కదా..! ప్రభుత్వం పేద ప్రజల కోసం అవి చేస్తున్నాం..ఇవి చేస్తున్నాం అని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తుంటారు. కానీ వాస్తవిక జీవితంలో సామాన్య ప్రజలకు ఎంతో దుర్భరమైన పరిస్థితుల్లో గడుపుతున్నారు. ప్రభుత్వం పబ్బం గడుపుకోవడానికి ఎలక్షన్ల సమయంలో పేదల సంక్షేమానికి పెద్ద పీఠ వేస్తున్నామని చెబుతున్నా..కొన్ని సంఘటనలు చూస్తుంటే..మనం ఇంత ధరిద్రమైన సమాజంలో ఉన్నామా అన్న బాధ కలుగుతుంది.
కొన్ని సార్లు..డబ్బుకు ఉన్న పాటి విలువ మనిషి ప్రాణానికి లేకుండా పోయింది. ముఖ్యంగా ప్రభుత్వాసుపత్రుల్లో జరిగే దారుణాలు చూస్తుంటే..సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ మద్య తన భార్య శవాన్ని అంబులెన్స్ లో తీసుకు వెళ్లడానికి డబ్బులు లేక చాపలో చుట్టుకొని తీసుకు వెళ్లి విషయం గుర్తుంది కదా..ఈ వార్త యావత్ భారత దేశంలో పెను సంచలనం సృష్టించింది. ఇలాంటి సంఘటనలు పలు మార్లు జరిగినా..ప్రభుత్వాసుపత్రుల తీరు మాత్రం మారడం లేదు.
తాజాగా ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురి జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ విషాదంలో ఒకవైపు అంబులెన్స్ సిబ్బంది చేసిన ఆలస్యం నిండు ప్రాణాలు తీస్తే.. మరోవైపు వైద్యుల కర్కశత్వం కట్టుకున్న భార్య శవాన్ని కిలోమీటర్ల దూరానికి తోపుడు బండిలో తోసుకుంటూ తీసుకెళ్లేలా చేసింది.మెయిన్పురి జిల్లాకు చెందిన 36 ఏళ్ల కన్హయ్యలాల్ తన భార్య సోనీ అస్వస్థతకు లోనవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లడానికి అంబులెన్స్కు ఫోన్ చేశాడు. ఎంత సేపటికీ రాకపోవడంతో..భార్యను తోపుడు బండిపై తోసుకుంటూ ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న మెయిన్పురి జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లాడు.
ఆమెను పరీక్షించిన వైద్యులు మార్గం మధ్యలోనే చనిపోయిందని చెప్పడంతో ఒక్క సారిగా కప్పకూలాడు కన్హయ్య. ఇదిలా ఉంటే..యూపీ వైద్యశాఖ ముఖ్య కార్యదర్శి ప్రశాంత్ త్రివేది స్పందిస్తూ.. 108 అంబులెన్స్ నెంబర్కు ఎలాంటి ఫోన్ రాలేదన్నారు. కన్హయ్య చాలా పేదవాడు అతని దగ్గర ఫోన్ చేసేందుకు మొబైల్ కూడా లేదన్నారు. ఒకవేళ ఫోన్ చేసినా ఆస్పత్రికో లేదా వేరొక నెంబర్కో ఫోన్ చేసి ఉంటారని తెలిపారు. ఈ సంఘటన దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.