ఊహించినట్టుగానే సీఎం చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేశారు. ఇక ఎన్డీఏ నుంచి బయటికి వచ్చేశాడు కాబట్టి మోహమాటం లేకుండా నరేంద్రమోడీపై , జగన్ పై, పవన్ కల్యాణ్ పై విమర్శల జోరు పెంచేశారు. అందుకు అసెంబ్లీని వేదికగా చేసుకుంటున్నారు. అందుకనే రెండు, మూడు రోజులుగా చంద్రబాబు అసెంబ్లీలో సుదీర్ఘంగా ప్రసంగిస్తున్నారు.
మొన్న తనను అభినందించేందుకు పెట్టిన తీర్మానంపై దాదాపు గంటన్నర సేపు మాట్లాడారు. మళ్లీ నిన్న ఎన్డీఏ రాష్ట్రానికి చేసిన అన్యాయంపై కేంద్రానికి తీర్మానం పంపుతూ మరో గంటన్నర సేపు మాట్లాడారు. ఆయన మాట్లాడినంతసేపు మీడియాలో మంచి ప్రచారం జరిగింది.
చంద్రబాబు ధాటిని అడ్డుకునేందుకు అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు లేరు. ఎందుకంటేవారు అసెంబ్లీని బహిష్కరించేశారు. అదే అసెంబ్లీలో ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు ఉంటే.. చంద్రబాబును, టీడీపీని కడిగేసేవారు..ఇన్నాళ్లూ ప్రత్యేక హోదా కోసం ఏం చేశారని నిలదీసేవారు.
చంద్రబాబు ప్రసంగానికి పదే పదే అడ్డుతగిలే వారు. దాని వల్లవారి వాదన కూడా జనంలోకి వెళ్లేది.. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది. బహుశా జగన్ తొలిసారి అసెంబ్లీకి డుమ్మా కొట్టాలన్న తన నిర్ణయంపై బాధపడి ఉంటారు..