ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం చిన్న పార్టీలన్నీ పెద్ద వ్యూహం పన్నుతున్నాయి. అవిశ్వాసంపై చర్చ జరిగిన రోజు.. నేషనల్ హైవే దిగ్బంధనం చేసి, రైళ్ల రాస్తారోకో చేయాలని హోదా సాధన సమితి ఆలోచిస్తోంది. హోదా సాధన సమితి ఆధ్వర్యంలో అన్నిపార్టీలకు చెందిన ముఖ్య నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. విమాన రాకపోకలు కూడా అడ్డుకుని ఢిల్లీకి షాక్ తగలేలా చేస్తామని సమితి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు మాట్లాడుతూ రానున్న ఆరు నెలల్లో హోదా సాధన సమితి ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. హోదా ఉద్యమంలో మహిళలు,విద్యార్థులు,ఉద్యోగులు,రైతులు ఇలా ప్రతి ఒక్కరినీ భాగస్వాములు చేయాలని నేతలు పిలుపునిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తులసిరెడ్డి మాట్లాడుతూ పిల్లికి బిచ్చం వేసినట్లు రాష్ట్రానికి కేంద్రం సహాయం అందిస్తుందన్నారు.
చివరి బడ్జెట్ కూడా ప్రకటించాక ఎంగిలిమేతుకులు విదిల్చినట్లు విదిలించిందని.. ఇక కేంద్రంతో అమీతుమీ తేల్చుకోవాల్సిన సమయం వొచ్చిందని తెలిపారు. హోదాసాధన సమితి శివాజీ మాట్లాడుతూ... తెలుగు వారు పిచ్చివాళ్ళు కాదని, భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ ఆ సంగతి మర్చిపోవద్దని కేంద్రాన్ని కోరారు. తెలుగు ప్రజలు డబ్బుమనుషులు కాదని.. రాంమాధవ్ గారు కాదు కదా.. ఎవ్వరు మమ్మల్ని విడదీయలేరని అన్నారు.
హోదా కోసం పవర్ గ్రిడ్స్ ఆపేసి, గుజరాత్ ఓ.యన్.జి.సి, రిలయన్స్ పెట్రో కెమికల్స్ వంటివి ఆపేస్తే కేంద్రమే కాళ్ళకిందకు వస్తుందని శివాజీ అంటున్నారు. ఉద్యమం విజయవంతం అయ్యాక తాను తిరిగి సినిమాలు చేసుకుంటానే తప్ప రాజకీయాలు తనకు వద్దని శివాజీ చెబుతున్నారు. హోదా ఉద్యమంలో ప్రాణత్యాగానికైనా సిద్ధంమని తెలిపారు. అయితే ఈ హోదా సాధన సమితి ప్రజల్లో సెంటిమెంట్ రాజేయగలుగుతుందా.. ఉద్యమాన్ని నడిపించగలుగుతుందా అన్నది చూడాలి.