ఏపీలో అవినీతి బాగా పెరిగిపోయింది.. ఏ చిన్న పని కోసమైనా లంచం ఇవ్వకపోతే పని సాగడంలేదు.. ఎమ్మెల్యేలు, మంత్రులు అంతా వాటాలు వేసుకుంటున్నారు.. పవన్ కల్యాణ్ ఇటీవల నోరు విప్పాక.. ఏపీలో అవినీతి గురించిన చర్చ బాగా జోరందుకుంది. ఇదే అభిప్రాయంతో ఉన్న కేంద్రం కూడా ఏపీ అవినీతిపై దృష్టి సారించిందట. తమపై అస్త్రాలు ఎక్కుపెడుతున్న చంద్రబాబుకు చెక్ పెట్లేందుకు ప్లాన్ రెడీ చేస్తోందని కథనాలు వెలువడుతున్నాయి.
మోడీతో విడాకులు తీసుకున్నాక చంద్రబాబు ఎమోషనల్ స్పీచ్ ఇస్తున్నారు. తనను బలహీన పరచడం అంటే తెలుగు జాతిని బలహీన పరచడమే అంటున్నారు. తెలుగుజాతిపై కేంద్రం యుద్దం చేస్తున్నంతగా సీన్ క్రియేట్ చేస్తున్నారు. ఈ దశలో చంద్రబాబుపై కేసులు పెడితే అది కాస్తా ఎదురుతిరిగి ఆయనకు సానుభూతి వెల్లువయ్యే అవకాశం ఉంది.
అందుకే కేంద్రం తెలివిగా ఐఏఎస్ ల అవినీతి నుంచి నరక్కురావాలని ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఈ కథనాలే నిజమైతే.. త్వరలో ఏపీ రాజకీయాల్లో పెను సంచలనాలు జరగబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఐదుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులపై సీబీఐ కేసులు నమోదు చేసే అవకాశాలున్నాయట. వీరికి సంబంధించిన సమాచారం సీబీఐ ఇప్పటికే సేకరించిందట.
ఈ ఐదుగురు ఐఏఎస్ అధికారుల్లో ముగ్గురు కీలక అధికార కేంద్రంలో ఉన్నారట. మిగిలిన ఇద్దరు అత్యంత ముఖ్యమైన శాఖల్లో ఉన్నారట. అవినీతి ఆరోపణల కారణంగానే ఈ కేసులు నమోదు చేస్తారట. వీరంతా ప్రభుత్వానికి అడ్డగోలుగా సహకరించి..భారీ అవినీతికి కారణమయ్యారని సీబీఐ ప్రాధమిక విచారణలో తేలిందట. ఏప్రిల్ మొదటి వారంలో ఈ సీబీఐ కేసుల వ్యవహారం ప్రారంభం కావచ్చని అంచనా.