తెలంగాణ రాజకీయాలు ముదిరి పాకాన పడుతున్నాయి. 2019 ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో విపక్ష కాంగ్రెస్ నేతలు.. అధికార టీఆర్ ఎస్ సహా కేసీఆర్పై దుమ్మెత్తి పోస్తున్నాయి. ఈ పరిస్థితిలో చేస్తున్న ఆరోపణలు హద్దు మీరుతు న్నాయనే వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నల్లగొండకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేస్తున్న ఆరోపణలు మరింత జోరందుకున్నాయి.
తమ శాసనసభ్వత్వ రద్దుపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్కుమార్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. తమను అనైతికంగా తొలగించారని సీఈసీకి ఫిర్యాదు చేశారు. తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీని రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ బాధ్యతల నుంచి తొలగించాలని కోరారు. తమ పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల బహిష్కరణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం చట్ట వ్యతిరేకంగా వ్యవహరించిందని ఆరోపించారు. రాజ్యసభ ఎన్నికల ఓటర్ల జాబితాలో కోమటిరెడ్డి, సంపత్ల పేర్లు చేర్చాలని సీఈసీకి విన్నవించారు.
అయితే, దీనికి భిన్నంగా సీఎం కేసీఆర్పై కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గన్మెన్లను తీసివేసి నన్ను హత్య చేయించాలని చూస్తున్నారని ఆరోపించారు. తనకు ఏమైనా జరిగితే కేసీఆర్తో పాటు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. కావాలనే పాత కేసులను రీ ఓపెన్ చేయించి అరెస్ట్ వారెంట్ జారీ చేశారని తెలిసిందని మండిపడ్డారు. తాను చావుకు భయపడే వ్యక్తిని కాదని.. ఒకవేళ చనిపోతే.. తనలాంటి దమ్మున్న లీడర్లు పుడతారని కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు.
కేసీఆర్ నియంతలాగా వ్యవహరిస్తూ అకారణంగా సభ్యత్వం రద్దు చేశారని కోమటిరెడ్డి దుయ్యబట్టారు. గతంలో హరీశ్ రావు గవర్నర్ మీద దాడి చేసినప్పుడు అప్పటి స్పీకర్ అందరినీ పిలిపించి మాట్లాడి వారంపాటు సస్పెండ్ చేశారని గుర్తు చేశారు. ప్రభుత్వం మాత్రం నిబంధనలు అనుసరించకుండా అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేసిందని నిప్పులు చెరిగారు. అయితే, కోమటి రెడ్డి చేసిన హత్యా ఆరోపణలపై టీఆర్ ఎస్ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్రభుత్వం పనిగట్టుకుని ఎవరిపైనా కక్ష రాజకీయాలకు తెరదీయదని అంటున్నారు.
కోమటిరెడ్డివి కేవలం అక్కసుతో కూడిన కామెంట్లేనని, వాటిలో ఏమాత్రం పసలేదని చెబుతున్నారు. అసెంబ్లీలో నడుచుకోవాల్సిన తీరుపై కోమటిరెడ్డి తమకు క్లాస్ చెప్పాల్సిన అవసరం లేదని, తమకు తెలుసునని, అన్ని విషయాలూ నిబంధనల మేరకే జరుగుతున్నాయని వెల్లడించారు. మొత్తానికి మళ్లీ కోమటిరెడ్డి రాజకీయంగా విమర్శలు చేయడం, దీనికి టీఆర్ఎస్ కౌంటర్ వ్యాఖ్యలు ఆసక్తిగా మారింది.