ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఏపీ ప్రత్యేక హోదా నినాదమే వినిపిస్తుంది. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని కుండ బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. దాంతో ఏపిలో ప్రజలు, ప్రజా ప్రతినిధులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనే నినాదంతో రోడ్లపైకి వస్తున్నారు. ఇందుకు అన్ని పార్టీ నేతలు మద్దతు పలుకుతున్నారు. మొన్నటి వరకు బీజేపీతో స్నేహబంధాలన్ని నడిపించిన చంద్రబాబు నాయుడు సైతం తమకు కేంద్రం అన్యాయం చేస్తుందని అంటున్నారు.
అంతే కాదు కేంద్రంతో అమీ తూమీ అంటున్న చంద్రబాబు బీజేపీతో తెగదెంపులు చేసుకున్నారు. మొదటి నుంచి ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా పోరాడుతున్న వైసీపీ నేత జగన్ ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న విషయం తెలిసిందే. అంతే కాదు ఆంధ్రప్రదేశ్ ఏర్పడి నాలుగు సంవత్సరాలు గడిచినా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని..ప్రజల్లో చైతన్యం నింపడానికి జగన్ మోహన్ రెడ్డి ‘ప్రజా సంకల్ప యాత్ర’ మొదలు పెట్టారు.
ఈ క్రమంలో ఓ వైపు అధికారా పార్టీని ఎండగడుతూనే..మరోవైపు ప్రత్యేక ఉద్యమం వైపు అడుగులు వేస్తున్నారు. తమ ఎంపీలకు పార్లమెంట్ లో నిరసనలు చేయాలని సూచనలు ఇచ్చిన జగన్..కేంద్రంపై అవిశ్వాస తీర్మాణం కూడా పెట్టారు. దీంతో చంద్రబాబు నాయుడికి చురకలు అంటించినట్లు అయ్యింది. వెంటనే తన ఇమేజ్ దెబ్బతినకుండా పార్లమెంట్ లో టీడీపీ తరుపు నుంచి కూడా అవిశ్వాస తీర్మాణం పెట్టించారు. గత నాలుగు రోజుల నుంచి పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మాణం పెడుతూనే ఉన్నారు..అవి వాయిదా పడుతూనే ఉన్నాయి.
ఇదిలా ఉంటే..చంద్రబాబు నాయుడు బీజేపీ, జనసేన, వైసీపీ కుమ్మక్కై తెలుగుదేశం సర్కారుపై ముప్పేట దాడికి దిగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రానికి న్యాయం చేయకపోగా, పవన్, జగన్ ను అడ్డుపెట్టుకుని బీజేపీ మనపైనే కుట్ర చేస్తోందని విమర్శించారు. తనపై సీబీఐ ఎంక్వయిరీలంటూ వైసీపీ, జనసేనతో ఆరోపణలు చేయించి, విచారణకు ఆదేశించడం ద్వారా ప్రాజెక్టును ఆపాలన్నది బీజేపీ ఉద్దేశమని ఆరోపించారు.
ఏపీ ముఖ్యమంత్రిని కోర్టు బోనులో నిలబెట్టే వరకు మేము ప్రధానిని కలుస్తూనే ఉంటామని వైసీపీ నేతలు అంటున్నారు. కాగా, నదుల అనుసంధానానికి కీలకమైన పట్టిసీమపైనా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, వాటిని గట్టిగా తిప్పికొట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఎటువంటి విచారణకైనా తాను సిద్ధమేనని చంద్రబాబు స్పష్టం చేశారు.