వచ్చే ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు.. హఠాత్తుగా ఎన్నికలకు ఏడాది ముందు టీడీపీపై దండెత్తిన ఆయన ఈ సారి ఎవరి విజయానికి దోహదపడుతున్నారు. 2019 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ఎఫెక్ట్ ఎవరికి లాభం.. ఎవరికి నష్టం.. ఇలాంటి విశ్లేషణలన్నీ ఇప్పటికే మొదలయ్యాయి. గత ఎన్నికల్లో చంద్రబాబు విజయానికి పవన్ కల్యాణ్ కృషి చేసిన సంగతి తెలిసిందే. 


అయితే.. ఇప్పుడు పవన్ కల్యాణ్ టీడీపీపై ఫుల్ ఫైరింగ్ లో ఉన్నారు. ఏకంగా చంద్రబాబు, లోకేశ్ లను అవినీతి చక్రవర్తులుగా చిత్రీకరిస్తున్నారు. ఈయన మూడ్ చూస్తే టీడీపీతో పూర్తిగా తెగదెంపులు చేసుకున్నట్టే కనిపిస్తోంది. పవన్ కల్యాణ్ బీజేపీతో జట్టుకడతారన్న విశ్లేషణలూ ఉన్నాయి. మరోవైపు పవన్ తో టీడీపీపై విమర్శల డ్రామా అంతా బీజేపీ స్క్రిప్టు ప్రకారం జరుగుతున్నదనే వాదనలూ ఉన్నాయి. 


తాజాగా నటుడు శివాజీ బయటపెట్టిన ఆపరేషన్ ద్రవిడ ప్రకారం.. మరిన్ని సంచలనాలు జరగబోతున్నాయట. పవన్ కల్యాణ్ బీజేపీతో చేతులు కలుపుతారట. పవన్, జగన్ లను బీజేపీ తన రాజకీయ పావులుగా వాడుకుంటుందట. చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు గుప్పించి ఆయన్ను జైలుకు పంపించి.. జగన్, పవన్, బీజేపీ కూటమి ఏపీలో అధికారం హస్తగతం చేసుకుంటుందట.



అంతేకాదు.. ఆపరేషన్ పూర్తయ్యాక.. పవన్ కల్యాణ్ కు బీజేపీ కేంద్ర మంత్రి పదవి ఆఫర్ చేస్తుందట. కానీ సీఎం కుర్చీ ఎక్స్ పెక్ట్ చేసిన పవన్ కల్యాణ్ బీజేపీ ఎత్తుగడతో పూర్తిగా నిరాశచెందుతాడట.. అసలు రాజకీయాల పట్ల విరక్తి చెంది మళ్లీ సినిమాల్లోకి వచ్చేస్తాడట.. ఇదంతా నటుడు శివాజీ చెబుతున్న భవిష్యవాణి. తనకు అందిన కీలక సమాచారం అంటూ ఆయన ఆపరేషన్ గరుడ వివరాలు బయటపెట్టారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: