విశ్వసనీయతకు, నిజాయితీకి మేం మారు పేరు. నిప్పులు కడిగిన వంశం నుంచి వచ్చాం- అంటూ పదే పదే చెప్పుకొంటు న్న చంద్రబాబుకు శరాఘాతం వంటి దెబ్బ తగిలింది. బాబు తీరుతో విసిగిపోయిన, ఆయన వ్యవహార శైలితో తీవ్రంగా కలత చెందిన కర్ణాటక హైకోర్టు మాజీ న్యాయ మూర్తి రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ కేఎల్ మంజునాథ తన చైర్మన్ పదవికి అనూహ్యంగా రాజీనామా చేశారు. అయితే, ఇది ముందుగానే ఊహించిందే అయినప్పటికీ.. ఆలస్యంగా మాత్రం ఆయన చేసిన కామెంట్లు.. బాబు పరువును గోదారిలో కలిపేశాయి అంటున్నారు పరిశీలకులు. ఎంతో గొప్పగా చంద్రబాబు కర్ణాటక నుంచి ఏరికోరి మంజునాథ్ను బీసీ కమిషన్కు చైర్మన్గా నియమించుకున్నారు. రాష్ట్రంలో కాపు ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న నేపథ్యంలో బాబు ఈ కమిషన్ ను ఏర్పాటు చేయడం తెలిసిందే.
రాష్ట్రం మొత్తం పర్యటించిన మంజునాథ్ టీం.. బీసీల స్థితి గతులను పరిశీలించి కాపులకు రిజర్వేషన్ అంశంపై ఓ నిర్ణయాన్ని సిఫారసుల రూపంలో ప్రభుత్వానికి అందించాల్సి ఉంది. అయితే, బాబు అత్యుత్సాహం చూపించారు. కమిషన్ చైర్మన్ నివేదిక అందక ముందే ఆయన సభ్యలు అందించిన నివేదిక ఆధారంగా కాపులకు 5% రిజర్వేషన్ ఇచ్చేస్తూ.. అసెంబ్లీలో తీర్మానం చేయడం పెద్ద గందరగోళం సృష్టించింది. ఈ క్రమంలోనే చైర్మన్ మంజునాథ్కు, బాబుకు మధ్య తీవ్ర గ్యాప్ పెరిగింది. ఇక, అప్పట్లోనే ఆయన బెంగళూరుకు వెళ్లిపోయారు. ఇక, ఇప్పుడు తాజాగా.. మంజునాథ్ తన పదవికి రాజీనామా చేశారు. తాను నిర్వర్తించాల్సిన పని పూర్తయినందున పదవి నుంచి వైదొలుగుతున్నట్లు పేర్కొన్నారు.
ఈ మేరకు రాజీనామా లేఖను ప్రభుత్వానికి పంపించారు. నిజానికి ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుతో పూర్తిగా విసిగిపోయి ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. బీసీ కమిషన్కు ఏమాత్రం విలువ ఇవ్వకుండా తన ఇష్టప్రకార మే బాబు వ్యవహరించారు. దీంతో కమిషన్ చైర్మన్ మంజునాథ్ కినుక వహించారు. అప్పటి నుంచి కార్యాలయానికి కూడా రాలేదు. ముఖ్యమంత్రి నుంచి అవమానాలు ఎదురుకావడంతోపాటు ఆయన కనుసన్నల్లో పనిచేస్తున్న కమిషన్ సభ్యులు తనను లక్ష్యపెట్టకపోవడంతో మంజునాథ్ ఆవేదనకు గురై చివరకు పదవి నుంచి తప్పుకున్నట్లు సమాచారం. విలువ లేని కమిషన్కు చైర్మన్గా కొనసాగడం వ్యర్థమని ఆయన నిర్ణయానికొచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే మంజునాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పని లేకుండా జీతం తీసుకోవడం తనకు ఇష్టం లేదని, అందుకే బీసీ కమిషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేశానని చెప్పారు. తనకు కొన్ని విలువలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. బీసీ కమిషన్ పని డిసెంబర్లోనే పూర్తయిందని, అప్పటివరకే జీతం తీసుకున్నానని వెల్లడించారు. రెండేళ్లపాటు విధి నిర్వహణలో ఉన్నట్లు తెలిపారు. నివేదికను ప్రభు త్వానికి కాకుండా మెంబర్ సెక్రటరీ కి ఇచ్చానని, అంటే తన పని పూర్తయినట్లేనని పేర్కొన్నారు. మొత్తానికి ఈ పరిణామం.. బాబుకు శరాఘాతం కిందే లెక్కించాల్సి ఉంటుందని అంటున్నారు పరిశీలకులు. విలువ గురించి పాఠాలు చెప్పే బాబుకు మంజునాథ్ లేఖ మింగుడు పడదని అంటున్నారు. మరి బాబు దీనిని ఎలా చూస్తారో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.