జేసీ బ్రదర్స్లో చిన్నవాడు, తాడిపత్రి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి హవా తగ్గిపోతోందా? నియోజకవ ర్గంలో ఒంటరివాడై పోతున్నారా? తన కోపమె తనకు శత్రువుగా మారుతోందా? అంటే ఔననే అంటున్నారు టీడీపీ నేతలు. స్థానికంగా ఎంతో బలం ఉన్న జేసీ వర్గానికి ఇప్పుడు ఎదురు దెబ్బలు తగులుతున్నాయని చెబుతున్నారు. నియోజకవర్గంలో ప్రభాకర్ రెడ్డి పట్టుకోల్పోతున్నాడని అంటున్నారు. నిజానికి వచ్చే ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఇద్దరు బ్రదర్స్. వారి వారి వారసులను రంగంలోకి దింపాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే నియోజకవర్గంలో పట్టు పెంచుకునేందుకు మరింత దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ నేతల మధ్య ఏర్పడిన చీలిక జేసీ ప్రభాకర్రెడ్డిని ఒంటరిని చేసిందనే టాపిక్ వినిపిస్తోంది.
విషయంలోకి వెళ్తే.. తాడిపత్రిలో ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డికి వ్యతిరేకంగా టీడీపీలోనే ఒక కూటమి ఏర్పడినట్టు సమాచారం. టీడీపీలో ఏళ్ల తరబడి పాతుకుపోయిన పాత నేతలే ఇలా కూటమి కట్టినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన జేసీ దివాకర్రెడ్డి అంతకుముందే పార్టీలో ఉన్న నాయకులను కలుపుకుని పోవడంలో తేడాలొచ్చినట్టు తెలుస్తోంది. 1995 నుంచి ఫయాజ్బాషా టీడీపీలో ఉన్నారు. ఆ తరువాత హరికృష్ణ స్థాపించిన అన్న టీడీపీలో ఫయాజ్ చేరారు. ఆ పార్టీ ఎత్తేయడంతో తిరిగి ఆయన బాబు టీడీపీలోకి వచ్చారు. దీంతో ఆయనకు అప్పట్లో మైనారిటీ కార్పొరేషన్ డైరెక్టర్ పదవిని కూడా ఇచ్చారు. అప్పట్లో జేసీ ప్రభాకర్ రెడ్డికి ఫయాజ్ బాషాకు విభేదాలు న్నాయి.
ఇదిలావుంటే, 2014లో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో జేసీ బ్రదర్స్ టీడీపీ సైకిలెక్కిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అప్పటి ఎన్నికల్లో తాడిపత్రి అసెంబ్లీ టీడీపీ టికెట్ జేసీ ప్రభాకర్రెడ్డికి దక్కింది. వెంటనే ప్రభాకర్ రెడ్డి ఫయాజ్ ఇంటికెళ్లి తన విజయానికి తోడ్పడాలని కోరారు. ప్రభాకర్రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. తన విజయానికి కృషి చేసిన ఫయాజ్కు ఏదైనా నామినేటెడ్ పోస్టు ఇప్పిస్తానని చెప్పినట్టు సమాచారం. అనంతరం జరిగిన పరిణామాల్లో గతంలో ఫయాజ్ అనుచరుడిగా ఉన్న జిలాన్బాషాకు మున్సి పల్ వైస్చైర్మన్ పదవిని ఇప్పించారు. రాయదుర్గంలో ఎమ్మెల్యే అల్లుడు దీపక్రెడ్డిని ఎమ్మెల్సీగా చేయించుకున్నారు. ఈ కోవలో తనను నిర్లక్ష్యం చేస్తున్నారని ఫయాజ్ ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డికి క్రమంగా దూరమయ్యారు.
అప్పటికే తాడిపత్రి టీడీపీలో స్థానిక కౌన్సిలర్ జయచంద్రారెడ్డి, అతని సోదరుడు జగదీశ్వరరెడ్డి ఎమ్మెల్యేకి వ్యతిరేకమయ్యారు. కౌన్సిలర్ జయచంద్రారెడ్డిని మున్సిపల్ కౌన్సిల్ నుంచి రెండుసార్లు సస్పెండ్ చేయడంతో వారు స్థానిక ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా మారారు. తాజాగా వారితో ఫయాజ్ కలిసినట్టు సమాచారం. ఇదిలా ఉండగా ఒకప్పుడు జేసీ సోదరులకు అనుచరుడిగా ఉన్న స్థానిక టీడీపీ నేత కాకర్ల రంగనాథ్ కూడా ఎమ్మెల్యే వ్యతిరేక వర్గంలో కలిసిపోయారు.
ఈ కోవలో తాజాగా జరిగిన కరపత్రాల పంపిణీ వ్యవహారంలో ఎమ్మెల్యే అనుచరులు పోలీసులకు ఫిర్యాదు చేయడం, ఇద్దర్ని అరెస్టు చేయడం, వారిని విడిపించాలని తాడిపత్రి టీడీపీ సీనియర్ నేతలు ధర్నా చేయడం జరిగిపోయాయి. దీంతో తాడిపత్రి టీడీపీలో రెండు గ్రూపులున్నట్టు బట్టబయలైంది. మొత్తంగా జేసీ ప్రభాకర్రెడ్డి నియోజకవర్గంలో ఒంటరి వాడైపోతున్నాడని అంటున్నారు పరిశీలకులు. మరి ఈపరిణామాలు ఎన్నికల వరకు కొనసాగితే.. జేసీ కుటుంబం నుంచి ఎవరు నిలుచున్నాగెలుపు కష్టమేనని చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.