రాజకీయాల్లోనే గాక, శక్తిమంతుల జాబితాలోనూ ఏపీ సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధినేత జగన్కు మధ్య హోరా హోరీ పోరు జరుగుతోంది. రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న వీరు.. మాటల తూటాలు, పదునైన విమర్శలు చేసుకుంటూ ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్న విషయం తెలిసిందే! 2019 ఎన్నికల్లో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని జగన్, ఎలాగైనా అధికారం నిలబెట్టుకోవాలని చంద్రబాబు.. ఎవరి వ్యూహాల్లో వారు నిమగ్నమై ఉన్నారు. ఇదే సమయంలో వీరిద్దరి గురించి ఇప్పుడో ఆసక్తికర విషయాన్ని ప్రముఖ ఆంగ్ల పత్రిక `ది ఇండియన్ ఎక్స్ప్రెస్` బయటపెట్టింది. దేశంలో అత్యంత శక్తిమంతులైన వారి జాబితాను ఇటీవల విడుదలచేసింది. ఇందులో నలుగురు తెలుగువారు ఉండగా.. వీరిలో జగన్ ముందువరుసలో ఉన్నారు. ఆయన తర్వాతే ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉండటం గమనార్హం!!
భారత్లోని శక్తిమంతుల జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన కీలక నేతలకు చోటు దక్కింది. రెండు రాష్ట్రాల నుంచి కలుపుకుంటే ఏకంగా నలుగురికి చోటు దక్కితే ముగ్గురు ఏపీకి చెందిన వారు. కేసీఆర్. ప్రముఖ ఆంగ్ల దినపత్రిక `ది ఇండియన్ ఎక్స్ ప్రెస్` ఈ ర్యాంకులు ప్రకటించింది. ఈ వంద మందిలో ఏపీ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డికి 35వ ర్యాంక్ రాగా, చంద్రబాబుకు 36వ ర్యాంకు వచ్చింది. చంద్రబాబుకు గట్టి ప్రత్యామ్నాయంగా వైఎస్ జగన్ నిలిచారని ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక వివరించింది. ప్రత్యేక హోదా కోసం నిరంతరం ఒత్తిడి తీసుకురావడంలో, చంద్రబాబు, బీజేపీ మధ్య బంధం తెగిపోవడానికి జగనే కారణమని అభిప్రాయపడింది. పాదయాత్ర ద్వారా ప్రజల్లో ఉంటూ వారి సమస్యలు తెలుసుకుంటున్నారని పేర్కొంది.
ఈ జాబితాలో 36వ స్థానంలో ఉన్న చంద్రబాబు ఏపీకి పెట్టుబడులు తేవడంలో కృషి చేస్తున్నారని పేర్కొంది. ఏపీకి ముఖ్యమంత్రి అయినప్పటికీ సొంత రాష్ట్రంలో చంద్రబాబుకు ఇల్లు లేదని ద ఇండియన్ ఎక్స్ప్రెస్ వెల్లడించింది. ఉండవల్లి సమీపంలో ఒక అద్దె ఇంట్లో ఆయన నివాసం ఉంటున్నారని వివరించింది. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 52వ స్థానంలో ఉన్నారు. వాస్తు నమ్మకాలతో ఆయన కొన్ని సంవత్సరాల నుంచి సెక్రటేరియట్ లోకి అడుగుపెట్టడంలేదని ఇండియన్ ఎక్స్ ప్రెస్ పేర్కొంది. ధర్డ్ ఫ్రంట్ కోసం కేసీఆర్ ప్రయత్నాలను వివరించింది. ఇక శక్తిమంతులైన 100 మంది వ్యక్తుల జాబితాలో ప్రధాని మోదీ నెంబర్ వన్ స్థానంలో.. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా రెండో స్థానంలో ఉన్నారు.
సోనియాగాంధీ ఐదో స్థానంలో ఉన్నారు. మమతా బెనర్జీ ఆరో స్థానంలో నిలిచారు. ముఖేష్ అంబానీ 10వ స్థానంలో నిలిచారు. రాహుల్ గాంధీ 11 వ స్థానం సొంతం చేసుకున్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు 58వ స్థానంలో ఉన్నారు. అయితే ఈ జాబితాలో తెలంగాణ తరఫున కేసీఆర్ మినహా మరో నాయకుడు లేకపోవటం విశేషం. మొత్తానికి జగన్.. చంద్రబాబును దాటి ఒక స్థానంలో మెరుగ్గా ఉన్నారు.