రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు! ఎవరు ఎలాగైనా మారొచ్చు!దీనికి నియమాలు, నీతితో పనేలేదు. నిజానికి రాజకీయాల్లో శాశ్వత మిత్రులు కానీ, శాశ్వత శత్రువులు కానీ ఉండరని అంటారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలను రాజమండ్రి మాజీ ఎంపీ, కాంగ్రెస్ మాజీ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ స్ఫష్టం చేస్తున్నారు. 2014కు ముందు ఏపీ విభజన సమయం లో ఆయన కాంగ్రెస్ గూటికి రాం రాం చెప్పి పార్టీ నుంచి బయటకు వచ్చారు. అయితే, అప్పటి ఎన్నికల్లో ఆయన దూరం గానే ఉన్నారు. అంతేకాదు, ఇప్పటి వరకు ఆయన రాజకీయ రీ ఎంట్రీపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారా? మళ్లీ తన హవా ప్రదర్శిస్తారా? అనే విషయంలో ఇప్పటి వరకు ఉండవల్లి క్లారిటీ ఇచ్చింది లేదు. అయితే, ఏపీ సమస్యలపైనా, ఏపీ ప్రభుత్వంపై ఆయన ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉన్నారు.
అంతేకాదు, అటు ఢిల్లీ, ఇటు ఏపీ రాజకీయ పరిస్థితులపై ఆయన ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. ఇటీవల జనసేనాని పవన్ నిర్వహించిన సమావేశంలోనూ ఉండవల్లి కీలక పాత్ర పోషించారు. జేఎఫ్సీ సమావేశానికి హాజరైన ఆయన తనదైన శైలిలో ప్రస్తుత రాజకీయాలను కడిగి పారేశారు. అదేవిధంగా తరచుగా మీడియా సమావేశాలు పెట్టే ఉండవల్లి.. తాజా రాజకీయ పరిస్థితులు, ఆయన ప్లాన్స్ను వినిపించేవారు. అయితే, తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేదీ లేనిదీ మాత్రం వెల్లడించలేదు. పైగా.. తిరిగి కాంగ్రెస్ గూటికే వెళ్తారా? అనే విషయంలోనూ ఆయన క్లారిటీ ఇవ్వలేదు.
అయితే, తాజాగా ఆయన వెల్లడించిన విషయాలను బట్టి త్వరలోనే ఉండవల్లి టీడీపీ శిబిరంలోకి చేరనున్నారనే వార్తలు ఊపందుకున్నా యి. రాజకీయంగా తనకు చంద్రబాబు శత్రువేమీ కాదని ఉండవల్లి తరచుగా చెబుతుండడం తాజా పరిణామాలకు మరింత బలం చేకూరుస్తోంది. విషయంలోకి వెళ్తే.. ఏపీలో ప్రస్తుతం 2014 ఎన్నికల ముందున్న పరిస్థితులున్నాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ హోదా ఎలా సాధిస్తారో టీడీపీ, వైసీపీ ప్రజలకు స్పష్టంగా చెప్పాలన్నారు. 2019లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ప్రత్యేక హోదా ఇస్తే బీహార్, ఒడిశా వంటి రాష్ట్రాలు ఊరుకుంటాయా అని, ప్రత్యేక హోదా ఇస్తానంటున్న కాంగ్రెస్తో టీడీపీ, వైసీపీ కలుస్తాయా? అని ఆయన ప్రశ్నిం చారు.
ప్రత్యేక హోదా ఉద్యమంలో తనను పిలిస్తే టీడీపీ నిరసన కార్యక్రమాలకు మద్దతు తెలుపుతానని ఉండవల్లి అరుణ్కుమార్ స్పష్టం చేశారు. దీనిని బట్టి రాజకీయ విశ్లేషకులు.. త్వరలోనే ఉండవల్లి బాబు పంచన చేరే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు. లేకుంటే.. ప్రత్యేక హోదా కోసం ఒకపక్క జనసేనాని, వామపక్షాలు, వైసీపీ కూడా పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్న సమయంలో ఏరికోరి ఉండవల్లి టీడీపీకి మాత్రమే తాను మద్దితిస్తానని చెప్పడం వెనుక రీజన్ ఇదేనని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి