తెలుగు ఇండస్ట్రీలో 90వ దశకంలో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి మెప్పించారు నటి సుమలత. చిరంజీవి సరసన శుభలేఖ", 'ఖైదీ" వంటి చిత్రాలు, అలాగే 'శ్రుతిలయలు" వంటి సంగీత భరత చిత్రం ద్వారా ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్రల్లో నటించారు. ఆ మద్య 'బతుకు జట్కాబండి" పేరుతో 'జీ తెలుగు" చానల్ ప్రసారం చేసే ఓ సామాజిక కార్యక్రమానికి సుమలత వ్యాఖ్యాతగా వ్యవహరించారు. కన్నడ నటుడు, రాజకీయ వేత్త అంబరీష్ తో వివాహం జరిగిన తర్వాత సినిమాలకు దూరమయ్యారు సుమలత. కొంత కాలం తర్వాత బుల్లితెరపై నటించారు.
ఇక వచ్చే నెలలో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రముఖ సీనియర్ నటి సుమలత కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేయనున్నారు. సుమలతకు టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పెద్దలు కూడా అంగీకరించారు. సుమలత భర్త అంబరీష్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న క్రమంలో సుమలతకు టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించినట్టు సమాచారం. అయితే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య మాత్రం అంబరీష్ వైపే మొగ్గుచూపుతున్నారు.
ఒకవేళ అంబరీష్ కు టికెట్ ఇవ్వకుంటే.. ఆ ప్రభావం మైసూరు జిల్లాపై పడుతుందని అంటున్నాడు. ఇదిలా ఉంటే ఆ మద్య కర్ణాటకలో రాహుల్ గాంధీ పర్యటించే సమయంలో తన ఆరోగ్య పరిస్థితి వివరించి..తనకు బదులుగా తన భార్య సుమలతకు టికెట్ ఇవ్వాల్సిందిగా అంబరీష్ కోరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే సుమకు టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం అంగీకరించింది.