కర్ణాటకలో రాజకీయం సరికొత్త రూపుదాల్చుతుందా...? ఈ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరించినా అధికారాన్ని చేజిక్కించుకోవడంలో విఫలమవుతుందా..? పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురైన అనుభవమే కర్ణాటకలోనూ తప్పదా..? అవసరమైన మ్యాజిక్ ఫిగర్ రాకున్నాఅమిత్షా మాయాజాలంతో బీజేపీని అధికారంలోకి వస్తుందా..? ఈసారి జేడీఎస్ కింగ్మేకర్గా నిలిచినా కింగ్ ఎవరవుతారు..? తాజాగా వెల్లడించిన ఇండియాటుడే-కార్వి నిర్వహించిన ఒపీనియన్ పోల్ సర్వే ఫలితాలతో అందరిలో ఈ ఆసక్తికరమైన ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఇంతకు ముందు పలు సంస్థలు నిర్వహించిన ప్రీపోల్ సర్వేలు మాత్రం మళ్లీ కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని చెప్పాయి. అయితే ఇండియాటుడే-కార్వి ఓపినియన్ పోల్ సర్వే మాత్రం కన్నడలో హంగ్ ఏర్పడుతుందని చెబుతోంది. కర్ణాటకలో ఇండియాటుడే-కార్వి ఒపీనియన్ పోల్ సర్వే మార్చి 17 నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు కొనసాగింది. రాష్ట్రంలో హంగ్ ఏర్పడుతుందని చెప్పింది. 90నుంచి 101సీట్లతో కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించనుంది. 34-43సీట్లతో జేడీఎస్ కింగ్ మేకర్ పాత్ర పోషించబోతోంది. 78-86 సీట్లతో బీజేపీ నిలవబోతోంది.
అయితే బీజేపీకి ఓట్ల శాతం పెరుగుతుంది కానీ అధికారంలోకి రావడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ను అందుకోలేదని తేలింది. అదేవిధంగా బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్పకంటే ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకే ఎక్కువ మద్దతు ఇంటుందని సర్వేలో తేలింది. దీంతో కర్ణాటకలో రాజకీయం రంజుగా ఉంటుందని పలువురు నాయకులు అంటున్నారు. గతంలో పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు సాధించినా అధికారం చేజిక్కించు కోవడంలో విఫలమైంది. ఇదే సమయంలో కాంగ్రెస్ కన్నా తక్కువ సీట్లు గెలిచిన బీజేపీ ప్రాంతీయ పార్టీల మద్దతుతో అనూహ్యంగా అధికారంలోకి వచ్చింది.
ఇదే వ్యూహాన్నిబీజేపీ కర్ణాటకలోనూ అమలు చేయబోతుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఒకవేళ హంగ్ ఏర్పడితే కాంగ్రెస్, బీజేపీల్లో ఎవరికి జేడీఎస్ మద్దుతుండాలనే ప్రశ్నకు కాంగ్రెస్కే జేడీఎస్-బీఎస్పీ కూటమి మద్దతు ఇవ్వాలని సర్వేలో పాల్గొన్న39 శాతం మంది కన్నడిగులు అభిప్రాయపడ్డారు. కేవలం 29శాతం మందే జేడీఎస్ బీజేపీతో వెళ్తే బాగుంటుందని చెప్పారు. ఇక్కడ బీజేపీ ఏం చేయబోతున్నదన్నదానిపై తీవ్ర ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీకి మెజార్టీ లేకపోయినా ఇతర పార్టీల సహకారంతో ఎలా అధికారం పీఠం దక్కించుకుందో ఇప్పుడు కూడా ఇక్కడ అదే చేస్తుందా ? ఇందుకోసం ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తుంది అన్నది ఆసక్తిగా మారింది.