రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు. శాశ్వత శత్రువుల కూడా ఉండరు! ఇప్పుడు ఇదే విషయం మరోసారి రుజువు కాబోతోంది. వైసీపీ తరఫున 2014లో ఎంపీగా గెలిచినా.. ఆయన మాత్రం వైసీపీలో ఇమడ లేకపోతున్నారు. ముఖ్యంగా అధినేత తీసుకుంటున్న నిర్ణయాలు, ఆయన విధానాలను ఆయన పరోక్షంగా వ్యతిరేకిస్తున్నారు. ఫలితంగా ఈ ఎంపీకి, వైసీపీ అధినేతకు మధ్య దూరం పెరిగిపోతోంది. కాంగ్రెస్లో సీనియర్ నేతగా, ముఖ్యంగా వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత ఆప్తమిత్రుడిగా మెలిగిన నెల్లూరు జిల్లాకు చెందిన రాజకీయ నేత మేకపాటి రాజమోహన్రెడ్డికి, జగన్కు మధ్య చాలా కాలంగా విభేదాలు నివురు గప్పిన నిప్పులాగా ఉన్నాయి. రెండేళ్ల కిందట ప్రత్యేక హోదా కోసం తన పార్టీ ఎంపీలతో రాజీనామా చేయిస్తానని జగన్ ప్రకటించిన సమయంలోనే మేకపాటి బహిరంగంగా విభేదించారు.
ఈ విషయంలో కనీసం తమ అభిప్రాయం కూడా తీసుకోకుండా అలా ఎలా ప్రకటిస్తారంటూ ఆయన ప్రశ్నించారు. అంతేకాదు, ఈ విషయంలో తాము అధినేతతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని అప్పట్లోనే చెప్పారు. ఇక, ఇటీవల ప్రత్యేక హోదా విషయంలో అవిశ్వాసం ప్రవేశ పెట్టడం, ఆ వెంటనే రాజీనామాలు చేయడం, వెనువెంటనే ఎంపీలు ఆమరణ దీక్షలకు దిగడం వంటి పరిణామాలు జరిగిపోయాయి. అయితే, ఈ పరిణామాలు పైకి కామన్గానే కనిపిస్తున్నా.. మేక పాటి మాత్రం ఇంత చేయడం అవసరమా? అనే కోణంలో ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. ప్రధానంగా ఒకపక్క జగన్ వైఖరితో విసుగు వస్తుంటే.. మరోపక్క, జగన్ రైట్ హ్యాండ్గా ఉన్న ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి వ్యవహారం మరింతగా మేకపాటిని ఇబ్బంది పెడుతోంది.
విజయసాయి రెడ్డి జిల్లాలో గ్రూప్ లు కడుతూ మేకపాటిని ఇబ్బందులకి గురిచేస్తున్నారని తెలుస్తోంది. నెల్లూరు జిల్లాలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా.. విజయసాయి కనుసన్నల్లోనే అన్నీ జరుగుతున్నాయని మేకపాటి భావిస్తున్నారు. అదేసమయంలో నెల్లూరు జిల్లా వ్యవహారాలు మొత్తం మరో రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డికి జగన్ అప్పగించారని అప్పటి నుంచీ వేమిరెడ్డి మేకపాటి పై పెత్తనం చేస్తున్నారని సమాచారం. అయితే ఈ పరిస్థితుల్లో పార్టీలో కొనసాగడం అసంభవం అని తన సన్నిహితుల వద్ద మేకపాటి అంటున్నారట. పార్టీలో ఉన్నప్పటికీ.. తమకు స్వతంత్రం లేకుండా పోయిందని, సీనియర్లమనే విలువ కూడా లేకుండా పోతోందని ఆయన చెప్పడం ద్వారా అసంతృప్తి బయటపడుతోంది.
ఈ క్రమంలోనే ఆయన త్వరలోనే టీడీపీలోకి జంప్ చేస్తారని అంటున్నారు. ఇప్పటికే ఆయన కుమారుడు కూడా టీడీపీ నేతలతో టచ్లో ఉంటున్నారని సమాచారం. మరో ఆరేడు మాసాల్లో మేకపాటి పార్టీ మార్పుపై తుదినిర్ణయం తీసుకునే చాన్స్ ఉందని చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. నిజానికి గత ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గం మొత్తం వైసీపీ వెంటే నడిచింది. అయితే, ఇప్పుడు మారుతున్న రాజకీయ సమీకరణల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో నెల్లూరులో వైసీపీ పరిస్థితి ఏంటనే చర్చ కూడా సాగుతుండడం గమనార్హం. మరి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.