అవును.. సీఎం కేసీఆర్ అనుమానమే నిజమైంది.. తాను ముందు ఊహించిందే జరిగింది.. మంత్రులు, పార్టీ ముఖ్య నేతలందరూ జాగ్రత్తగా ఉండాలనీ, ప్రతీక్షణం అప్రమత్తంగా ఉండాలనీ, కేంద్రం, నిఘా సంస్థలు మనపై దృష్టి సారించే, టార్గెట్ చేసే ప్రమాదం ఉందంటూ కేసీఆర్ హెచ్చరించిన కొద్దిరోజుల్లోనే అది నిజమైంది. అప్పుడెప్పుడో ఓ మంత్రి కుమారుడికి సీబీఐ పంపిన నోటీసులు ఇప్పుడు వెలుగులోకి రావడానికి ఇదే కారణంగా కనిపిస్తోంది. భూమాయతో కోట్లకొద్దీ రూపాయల్ని బ్యాంకు నుంచి అప్పనంగా రుణనంగా పొంది.. తర్వాత కట్టకుండా తిరిగిన వైనాన్ని బయటకు లాగేందుకు ఇప్పుడు సీబీఐ ప్రయత్నం తెలంగాణలో కలకలం రేపుతోంది.
రెండు నెలల కిందట రైతు సమన్వయ సమితుల సమావేశంలో సీఎం కేసీఆర్ ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కేంద్రంపై తీవ్రస్థాయిలో ఆయన మండిపడ్డారు. ఆ క్రమంలోనే కేసీఆర్ మంత్రులను, పార్టీ నేతలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇంతకీ ఏం జరిగిందంటే... మంత్రి జూపల్లి క`ష్ణారావు కుమారులు వరుణ్, అరుణ్ ఇద్దరూ వ్యాపార రంగంలో ఉన్నారు. కోర్టు వివాదాల్లో ఉన్న భూములను తమ పలుకుబడితో రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. కంపెనీలను ఏర్పాటు చేసి, ఆభూములను బ్యాంకుల్లో తనఖా పెట్టి, మార్కెట్ విలువకన్నా.. నాలుగురెట్లు అధిక విలువచూపి, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి, ఎస్బీఐ నుంచి రుణాలు పొందారు.
తీరా రుణాలు తిరిగి చెల్లించకపోవడంతో తనఖా పెట్టిన ఆస్తులను జప్తు చేసేందుకు బ్యాంకు అధికారులు సిద్ధమవగా అసలు విషయం బయటపడింది. కుదవపెట్టిన ఆస్తులకు, తీసుకున్న రుణాలకు అస్సలు పొంతనలేకపోవడంతో అధికారులు కంగుతిన్నారు. ఇలా బోగస్ పత్రాలతో కోట్ల రూపాయల రుణం పొందిన జూపల్లి వారసులపై సీబీఐ దృష్టి సారించడం, ఇప్పటికే ఈ విషయంపై ప్రధాని కార్యాలయానికి ఫిర్యాదు అందడం గమనార్హం.
అయితే గతేడాది జూలై 28న జూపల్లి అరుణ్కు సీబీఐ నోటీసులు జారీ చేయడం, విచారణకు హాజరుకావాలని ఆగస్టు 18న నోటీసుల్లో స్ఫష్టం చేయడం, ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో తీవ్ర చర్చ జరుగుతోంది. పార్టీ వర్గాల్లో హాట్హాట్ టాపిక్గా మారింది. ఇదిలా ఉండగా.. వారసుల వ్యవహారంతో మంత్రి జూపల్లికి రాజకీయంగా తిప్పలు తప్పవనీ, సీఎం కేసీఆర్ కూడా సీరియస్గా ఉన్నారనీ ఆ పార్టీ వర్గాల్లో ఆసక్తికరణ చర్చ జరుగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓ మంత్రి కుటుంబం కుంభకోణంలో చిక్కుకోవడంతో మిగతా మంత్రుల్లో కొందరు వణికిపోతున్నట్లు సమాచారం.
ఇక కేసీఆర్ ఈ విషయంలో ముగ్గురు నలుగురు మంత్రులను గతంలోనే జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించినట్టు కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు ముందుగా జూపల్లి తనయుల వ్యవహారం బయటకు రావడంతో ఆ మంత్రుల పేర్లు కూడా బయటకు వస్తాయా ? అన్న చర్చలు కూడా నడుస్తున్నాయి. ఏదేమైనా రాజకీయంగా ఈ వ్యవహారం టీఆర్ఎస్ను చిక్కుల్లో పడేసింది.