అనుకున్నట్టే అయింది.. బాబుగారి భయమే నిజమైంది.. ప్రత్యేక హోదా విషయంలో ఇన్నిరోజులూ ఆచితూచి అడుగులు వేస్తూ వస్తున్న బాబుగారు ఒక్కసారిగా ఇరకాటంలో పడిపోయారు. శాంతి, సంయమనం అంటూ వచ్చిన ఆయనకు ఇక అశాంతే మిగిలేలా ఉంది. రాజకీయ క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడేందుకు వ్యూహాత్మకంగా ఉంటున్న ఆయన ఊపిరిసలుపుకోనివ్వని స్థితిలోకి వెళ్లిపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎందుకింత కష్టం వచ్చిందని అనుకుంటున్నారా..? ఏం లేదండీ.. ఇన్ని రోజులూ ఎవరైతే మాట్లాడొద్దని బాబుగారు లోలోపల అనుకున్నారో.. వారే నోరు తెరిచారు. ఎడాపెడా మాట్లాడి పావుగంటలో ఒక్కసారిగా రాజకీయవేడి పెంచారు. బామ్మర్ది దూకుడుతో.. దీని పరిణామాలు ఎలా ఉంటాయోనని బావగారు తీవ్ర ఆందోళనకు గురయ్యారట.
ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు మంత్రి లోకేశ్, బామ్మర్ది, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సభలు, సమావేశాల్లో ఎలా మాట్లాడుతారో అందరికీ తెలిసిందే. ఇక ప్రసంగించడంలో లోకేశ్బాబు పరిస్థితి మరింత దయనీయం. గత ఎన్నికల ప్రచారంలో లోకేశ్ మాట్లాడుతూ టీడీపీనే ఓడించమని కార్యకర్తలకు ఇచ్చిన పిలుపును ఎవరూ మరిచిపోలేరు. కాంగ్రెస్, వైసీపీలను ఓడించమని చెప్పబోయి.. సొంతపార్టీ టీడీపీనే ఓడించాలని అనడం అప్పట్లో పెద్దజోక్గా నిలిచిపోయింది. ఇలా ఆయనవి చాలాచాలా ఉన్నాయి. ఓ సందర్భంగా ప్రత్యేక హోదా గురించి బాలకృష్ణను పలువురు విలేకరుల అడగ్గా.. ఆయన ఏం చెప్పారో కూడా ఇప్పటికీ ఎవ్వరికీ అర్థం కాలేదంటే అతిశయోక్తి కాదేమో.
బాలయ్య గత ఎన్నికల ప్రచారంలో శ్రీకాకుళంలో రామ్మోహన్నాయుడుకు ప్రచారం చేస్తూ జగన్కు ఓటేసి, వైసీపీని గెలిపించమని చెప్పడంతో అందరూ అవాక్కయ్యారు. ఇలా మామ, అల్లుడు తమ అయోమయ ప్రసంగాలతో చంద్రబాబుకు అనేకసార్లు తలనొప్పులు తెచ్చిపెట్టారు. అంతేగాకుండా కొన్నినెలల కిందట చంద్రబాబు విదేశీపర్యటనలో ఉన్నప్పుడు బాలకృష్ణ సీఎం కుర్చీలో కూర్చొని వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించడంపై కూడా అప్పట్లో దుమారం రేగింది. తాజాగా.. ప్రత్యేక హోదా సాధన కోసం విజయవాడలో చంద్రబాబు చేపట్టిన ధర్మపోరాట దీక్షలో నందమూరి నటసింహం బాలకృష్ణ జూలు విదిల్చారు. ఏకంగా ప్రధాని మోడీపై విరుచుకుపడ్డారు.
మాట ఇచ్చి, నమ్మకద్రోహం చేశావు.. నువ్వొక ద్రోహివి.. నిన్ను తరిమికొడతాం.. మోసం చేసిన మోడీని తరిమికొట్టాలి. నువ్వెక్కడైనా దాక్కో. . బంకర్లతో దాక్కున్నా లాక్కొచ్చి బాదుతాం.. అంటూ బాలకృష్ణ నిప్పులు చెరిగారు. అంతటితోనే ఆగలేదు. ముందు మర్యాద తెలుసుకో.. అన్నిటికన్నా ముందు పెద్దల్ని గౌరవించు.. భార్యను ప్రేమించడం తెలుసుకో.. ఎవరెవరినో అడ్డుపెట్టుకుని వ్యవహారాలు సాగిస్తున్న శిఖండివి నువ్వు.. అంటూ బాలయ్యబాబు విసిరిన డైలాగ్స్ ఇప్పుడు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. అనేక విమర్శలకు దారితీస్తున్నాయి. బాలకృష్ణ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఆయనపై కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేగాకుండా గవర్నర్కు కూడా ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవతున్నారు.
అయితే ఇక్కడ మరోవిషయం ఏమిటంటే.. లోలోపల మోడీ చంద్రబాబును మచ్చిక చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈనేపథ్యంలోనే ధర్మపోరాట దీక్ష చేస్తున్న చంద్రబాబు పుట్టిన రోజు శుభాకాంక్షలు కూడా చెప్పారు. చంద్రబాబు కూడా బీజేపీకి దూరం కావడాన్ని అస్సలే ఇష్టపడడం లేదనే ప్రచారం జరుగుతోంది. నిజానికి చంద్రబాబు కూడా దేనినీ తెగేదాక లాగరు. ఇదే సూత్రాన్ని ఉపయోగించి, అనేకసార్లు ఎన్డీయే నుంచి విడిపోయినా మళ్లీమళ్లీ కలిసారు. కానీ, ఇప్పుడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం మారిపోయింది. బాలకృష్ణ వ్యాఖ్యలతో బాబుగారు లోలోపల అసంతృప్తితో ఉన్నట్లు పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.