పిల్లినైనా కూడా నాలుగు గోడల మధ్య బంధించి కొడతామంటే.. తిరగబడుతుంది. ఇప్పుడు అదే వాస్తవం జనసేనాని విషయంలోనూ ఎదురవుతోంది. సౌమ్యుడు, శాంతి యుత రాజకీయాలను, అర్ధవంతమైన రాజకీయాలను కోరుకునేవాడు, ప్రజల కోసం తన కెరీర్ను సైతం వదులుకుని రాజకీయాల్లోకి వచ్చిన వాడు పవన్. మరి అలాంటి పవన్ విషయంలో కక్ష గట్టినట్టు, కత్తికట్టినట్టు వ్యవహరిస్తే.. ఆయనైనా ఎంతమేరకు ఊరుకుంటాడు? ఎంత సహనం ఉన్నా ఎన్నని భరిస్తాడు? ఇప్పుడు ఇవే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. పవన్ పరిస్థితి ప్రస్తుతం ఏమీ బాగోలేదు. ఆయనను ఓ విలన్ మాదిరిగా చిత్రీకరించేందుకు కొన్నివర్గాలు కంకణం కట్టుకున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు అనుకూల మీడియా పవన్కు ఇప్పుడు యాంటీ అయిపోయింది. పవన్ కేంద్రంగా యాంటీ ప్రచారం, యాంటీ ప్రోపగాండాకు తెరదీసింది.
ఈ నేపథ్యంలోనే పవన్ విషయంలో ఆయన తల్లి అంజనా దేవిని ఉద్దేశించి నటి శ్రీరెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను బాబు అనుకూల మీడియా వర్గం పదేపదే ప్రసారం చేసింది. దీనిని పవన్ ప్రశ్నించాడు. అదే.. మీడియా.. బాబును ఎవరైనా ఏమైనా అంటే.. ఇలానే ప్రసారం చేస్తుందా? అని నిలదీశాడు. అయినా కూడా మీడియాలో ఎక్కడా పునరాలోచన లేకపోగా.. తాము చేసింది కరెక్టే అనే కోణంలో ప్రసారాలు, ప్రకటనలు సాగాయి. దీంతో పవన్ సహజంగానే తనదైన కోణం లో రెచ్చిపోయాడు. మీడియా సంస్థలను నిషేధించాలని పిలుపునిచ్చాడు. కొందరు పనిగట్టుకుని చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ కనుసన్నల్లో పనిచేస్తున్నారని ఆరోపించాడు. అయితే, ఈ విషయంలో మెరుగైన సమాజం కోసం అంటూ నిత్యం తెలుగు ప్రజలను చైతన్య పరిచే.. టీవీ-9 ఛానెల్ పాత్ర ఎక్కువగా ఉంది.
దీంతో పవన్ ఆ చానెల్ సీఈవో రవిప్రకాశ్పై నిప్పులు చెరిగాడు. గతంలో రవిప్రకాశ్ పూజలు చేసిన ఫొటోలను పోస్ట్ చేసిన పవన్ 'రవి గుడ్ మార్నింగ్.. మీరు దేవుడిని పూజలను కూడా నమ్ముతారే' అని తన ట్విట్టర్ యుద్ధాన్ని ప్రారం భించాడు. `ప్రజలను భయపెడతావేంవోయ్` 'జైలు జీవితం వరమే' - 'నేను ఉన్మాదిని ఏమిట్రా' - 'ఫ్యాక్షన్ - ప్రాంతం - కులం' అంటూ ఒకే ట్వీట్లో మరో మూడు పోస్టులు పెట్టారు. అంతేకాకుండా తన పోస్టులకు వివరణ కూడా ఇచ్చారు. `మీడియాలో నీలాంటి వ్యక్తులు తప్పులు - అవమానాలు ఏ ఛానల్లో చూపించరు. ఏ పత్రికలో రాయరు. ఇప్పుడు సామాన్యుడి ఆయుధం సోషల్ మీడియా. దాని ద్వారానే నీ అవినీతి అంతర్జాతీయస్థాయి మోసపూరిత వార్తలు ప్రజలకు సాక్షాలతో చూపించాను. మీ 9 గంటల షోలో ఈ ఆర్టికల్స్ వేయి. మామీద మాత్రమే దాడి ఎందుకు? మేం ఎదురుదాడి చేయడం లేదనేగా? మీ టీవీ9 అందరికీ సమన్యాయం చేస్తుందని భావిస్తే వీటిని కూడా మీ షోలో వేయాలి.` అని పవన్ వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగానే పవన్ మరిన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఆరు నెలలుగా తనపై జరుగుతున్న దుష్ప్రచారం పై దర్యాప్తు జరపాలని తెలంగాణ పోలీసులను కోరనున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. సమాజంలోని కుళ్లు కూడా బయట పడుతుందన్నారు. ఈ దెబ్బతో తనను అప్రతిష్ఠపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్న పురుషులు - మహిళ జాతకాలు అన్నీ బయటకు వస్తాయని అది క్రమంగా అమరావతి వైపు దారి తీస్తుందంటూ పవన్ సంచలన ట్వీట్ చేశారు. దీనికి కొనసాగింపుగా..తనెందుకు ఇంత ఆగ్రహంగా రియాక్ట్ కావాల్సి వస్తుందో పవన్ వివరించారు. `మీరంతా కలిసి నడిరోడ్డుపై ఓ సోదరి బట్టలు విప్పించేలా ప్రోత్సహిస్తే దానిని మీడియా చూపించింది. అన్ని షోలకు అది కారణమైంది` అంటూ తన ఆవేశానికి కారణం వివరించారు. మొత్తంగా ఈ పరిణామం.. మెరుగైన సమాజం అంటూ డబ్బా కొట్టుకునే ఛానెల్కు పెను దెబ్బే అంటున్నారు పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.