ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన తర్వత టీడీపీ ప్రజలకు చేసిన మోసాన్ని వివరిస్తూ..ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘ప్రజా సంకల్ప యాత్ర ’ మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు జిల్లాలు పర్యటిస్తున్న ప్రస్తుతం కృష్ణా జిల్లాలో సాగుతోంది. ఈ క్రమంలో ఆయన పాదయాత్ర ఇవాళ నిమ్మకూరు చేరుకుంది. నిమ్మకూరులో నందమూరి కుటుంబీకులు కొందరు జగన్ ను కలిసారు. పలు అంశాలను ప్రస్తావించారు. దీనిపై స్పందించిన జగన్.. గ్రామస్థుల సమక్షంలో సంచలన ప్రకటన చేశారు.
కాగా, అక్కడి ప్రజలు నిమ్మకూరులో నీరు-చెట్టు పథకం కింద జరుగుతున్న అక్రమాలను నందమూరి కుటుంబీకులు జగన్ దృష్టికి తీసుకొచ్చారు. చెరువులో పొక్లెయిన్లతో తవ్విన దృశ్యాలను జగన్ కు చూపించారు. నిమ్మకూరును ఎన్టీఆర్ మనవడు, ఐటీ మంత్రి నారా లోకేష్ దత్తత తీసుకున్నారని చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ది నోచుకోలేదని ఆరోపించారు. దీనిపై స్పందించిన జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే కృష్ణా జిల్లాకు ‘నందమూరి తారక రామారావు’అని పేరు పెడతామని జగన్ ఈ సందర్భంగా గ్రామస్థులకు హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
నిమ్మకూరును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని జగన్ చెప్పారు. తాజాగా కృష్ణా జిల్లాకు నందమూరి తారక రామారావు పేరును పెడతానని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేసిన ప్రకటనను ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి స్వాగతించారు.
తన అల్లుడు చంద్రబాబునాయుడు, కొడుకు బాలకృష్ణ చేయలేని పనిని జగన్ చేస్తానని చెప్పడంతో తనకు పట్టలేని సంతోషంగా ఉందని ఈ ఉదయం వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా పై జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న పోరాటానికి ప్రజల మద్దతు లభిస్తుందని..తెలుగుదేశం నేతలు చిత్తశుద్ధి లేని డ్రామాలాడుతున్నారని ఆమె విమర్శించారు.