తెలుగు రాష్ట్రాలలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 24 గంటల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. కృష్ణా జిల్లాలో పిడుగులు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ శాఖ ప్రజలను అప్రమత్తం చేసింది. పలు ప్రాంతాలలో పిడుగులు పడే అవకాశం ఉందన్న హెచ్చరికలలో కృష్ణా జిల్లా కలెక్టరేట్ లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది.
నాగోల్, మోహన్ నగర్ , కొత్తపేట్ , చైతన్య పురి , దిల్ సుఖ్ నగర్, సరూర్ నగర్, కర్మన్ ఘాట్, చంపాపేట్, పాతబస్తీ, అశోక్ నగర్, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, నాంపల్లి, అబిడ్స్, కోఠి, ఖైరతాబాద్, బషీర్ బాగ్, బహదూర్ పురా, యాకుత్ పురా, చార్మినార్, చాంద్రాయణ గుట్ట, సైదాబాద్, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతున్నది. ఈదురు గాలులతో పలు కాలనీల్లో విద్యుత్ సరఫరా నిలిచి పోయింది.
వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలో సైతం విపరీతంగా వర్షాలు పడుతున్నాయి. కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజుల క్రితం విశాఖపట్నం, అమరావతిలోను ఇలాగే ఒక్కసారిగా వాతావరణం మారిన విషయం తెలిసిందే.విశాఖలో సముద్రం ఎరుపెక్కగా, అమరావతి, గుంటూరు, విజయవాడ తదితర ప్రాంతాల్లో హఠాత్తుగా సాయంత్రం నాలుగు గంటలకే చిమ్మని చీకట్లు కమ్ముకున్నాయి.
ఇక మధ్యాహ్నం అప్పటి దాకా ఎండ కనిపించింది. మధ్యాహ్నం రెండున్నర గంటలు దాటిన తర్వాత హఠాత్తుగా వాతావరణం మారిపోయింది. హైదరాబాదులో ఒకింత చీకట్లు కమ్ముకున్నాయి. కాగా, మరో 24 గంటల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ పేర్కొంది.