దశరాజకీయాల్లో గుణాత్మక మార్పు తెచ్చేందుకు ప్రాంతీయపార్టీలతో బలమైన ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి లైట్ తీసుకున్నారు. కేసీఆర్ ఫ్రంట్పై చంద్రబాబు వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అయితే గతంలోనే దేశంలో కూటముల ఏర్పాటు కీలకంగా వ్యవహరించిన చంద్రబాబు కేసీఆర్ ప్రయత్నాన్ని రాజకీయ ఎత్తుగడగానే కొట్టిపారేశారు. పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదంటూ చంద్రబాబు అనడం గమనార్హం. అయితే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం పక్కరాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును సంప్రదించకుండా ఇతర రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల నేతలను కలవడంపై కూడా విమర్శలు వచ్చిపడుతున్నాయి.
హైదరాబాద్లోని శుక్రవారం ఎన్టీఆర్ ట్రస్టుభవన్లో జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో బాబు మాట్లాడారు. ఫ్రంట్ లు, పొత్తుల గురించి పట్టించుకోకుండా తెలం గాణలో పార్టీ బలం పెంచుకోవడానికి పని చేయాలని వారికి సూచించారు. ‘‘ఫెడరల్ ఫ్రంట్ లేదు, ఏ ఫ్రంటూ లేదు. టీఆర్ఎస్లో ముఖ్య నిర్ణయాలు తీసుకోవడంలో అంతర్గతంగా సమస్యలేవో ఉన్నట్టున్నాయి. ఇదంతా స్థానిక సమస్యలు చర్చకు రాకుండా దృష్టి మళ్లించే ఎత్తుగడ’’ అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ‘‘ఈ ఫ్రంటు గురించి నాతో ఎవరూ మాట్లాడలేదు. ఇలాంటి ఎత్తుగడలను మీరు పట్టించుకోవాల్సిన పని లేదు’’అని తెలంగాణ టీడీపీ ముఖ్య నేతలకు సూచించారు.
అయితే ఇటీవల తమిళనాడు వెళ్లి డీఎంకే నేతలు కరుణానిధి, స్టాలిన్ తో భేటీ అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసీఆర్ ఆసక్తికరణ వ్యాఖ్యలు చేశారు. ఫ్రంట్ ఏర్పాటుపై పక్కరాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ కారా..? అని ఓ విలేకరి ప్రశ్నించగా.. చంద్రబాబుకు తనకు మంచి మిత్రుడనీ, ఆయనతో కూడా చర్చిస్తాననీ కేసీఆర్ చెప్పిన విషయం తెలిసిందే.
కానీ, వీటిని పట్టించుకోకుండా చంద్రబాబు ఫ్రంట్ను కేసీఆర్ జిమ్మిక్కుగానే చూడడం గమనార్హం. ఆయన ప్రధానంగా పార్టీ బలోపేతంపై దృష్టిసారించాలని నాయకులకు సూచించారు. ‘‘తెలంగాణ లో త్రిముఖ పోటీ ఉంటుంది. తద్వారా కొన్ని అసెంబ్లీ స్థానాల్లో టీడీపీకి అవకాశాలుంటాయి’’ అని విశ్లేషించారు. రాష్ట్ర ప్రభుత్వంపై మెతక వైఖరితో ఉండకుండా సమస్యలపై పోరాడాలని ఆదేశించారు.