కర్ణాటక రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ఈ నెల 12న జరగనున్న దరిమిలా ఇంతవరకు వెలువడిన అన్ని ఎన్నికల సర్వేలు, విశ్లేషణల్లోనూ, ఇప్పుడు ముంబై-కర్ణాటక ప్రాంతం లో బీజేపీ దినదిన ప్రవర్ధమానమౌతూ బలపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ మహారాష్ట్ర ప్రభావిత, లింగాయత్ ల ఆధిఖ్యత ఉన్న, ఈ ప్రాంతంలోని బెళగావి, బాగల్కోటె, విజయపుర, గదగ్, హావేరీ, ధార్వాడ జిల్లాల్లో కలిపి మొత్తం 50 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి.
2013 ఎన్నికల్లో వీటిలో 31 స్థానాలలో కాంగ్రెస్ విజయం సాధించింది. బీజేపీ 13స్థానాలే గెలిచింది. అప్పట్లో బీజేపీ లో మూడు చీలికలు ఏర్పడ్డాయి. యడ్యూరప్ప కేజేపీ, బి.శ్రీరాములు బీఎస్ఆర్ కాంగ్రెస్, బిజెపి పేరిట వేరువేరు కుంపట్లు పెట్టుకోవడంతో బీజేపీ ఓట్లు చీలిపోయి, కాంగ్రెస్ విపరీతంగా లబ్ధి పొందిందని సర్వేలు పేర్కొన్నాయి.
హైదరాబాద్-కర్ణాటక, ముంబై-కర్ణాటక ప్రాంతంపైనే ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆశలు ద్విగుణీకృతంగా పెట్టుకున్నారు. కానీ కాంగ్రెస్ ఇక్కడ దెబ్బతింటుందని, బీజేపీకి 27, కాంగ్రె్సకు 21స్థానాలు, జేడీఎస్కు 2సీట్లు దక్కవచ్చని సర్వేలు పేర్కొంటున్నాయి. ముంబై-కర్ణాటక ప్రాంతంలో కాంగ్రెస్ పరిస్థితి రోజు రోజుకు సంక్లిష్టంగా మారుతోందని ఆందోళన చెందుతున్న ఆ పార్టీ నేతలు. అందుకే కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీని అనారోగ్యంతో ఉన్నా కూడా ప్రచారానికి తీసుకొస్తున్నారు.
రేపు అంటే మంగళవారం (మే-8న) ఆమె విజయపుర సభలో ప్రసంగించనున్నారు. ఈ సభ ఏర్పాట్ల పరిశీలనకు ఏఐసీసీ కార్యదర్శి మాణిక్యం ఠాగూర్ విజయపుర ఇప్పటికే చేరుకున్నారు. అయితే ప్రస్తుతానికి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీ సోమవారం నుంచి మళ్లీ కర్ణాటకలో తుది విడత ప్రచారం చేయనున్నారు. కోలారు జిల్లాలోని మాలూరు, శిడ్లఘట్ట నియోజకవర్గాలలో జరిగే ర్యాలీల్లో ప్రసంగిస్తారు.
8న నగర శివారులో జరిగే ర్యాలీలో పాల్గొంటారు. 9న మైసూరుజిల్లాలో పర్యటిస్తారు. కాగా, మాజీ ప్రధాని ఆర్థిక నిపుణుడైన మన్మోహన్సింగ్ సోమవారం బెంగళూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడతారు. దేశంలోని ప్రస్తుత ఆర్థిక స్థితిగతులను వివరిస్తారు. ఆయన చెబితే దాని ప్రభావం విఙ్జులైన బెంగళూరు ఓటర్ల పై తప్పకుండా ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు ఆశిస్తున్నాయి.
ప్రధాని నరెంద్ర మోడీ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొనగానే ప్రచారవ్యూలతో ప్రచార దశ దిశ బిజెపికి అనుకూలంగా మార్చేశారు. ఈ సందర్భంగా బీజేపీనేత, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పపై కాంగ్రెస్ తప్పుడు అవినీతి కేసులు బనాయించారని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.
ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రస్తుత అధ్యక్షుడు రాహుల్గాంధీ లపై ₹ 5000 కోట్ల అక్రమాల ఆరోపణలు లేవా? అని ఆదివారం ఆయన విరుచుకు పడ్డారు. అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని ఆయన రాయచూరు, జమ ఖండి, హుబ్లీ సభల్లో ప్రసంగించారు. "ఆ తల్లి, కొడుకులు ప్రస్తుతం బెయిల్ పై బయటకు వచారని? అసలు బయట ఎందుకున్నారు? మరెందుకు ఎందుకు కోర్టుకు హాజరు కావడం లేదు? వారిపై ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదైంది? వారు ఏ ఏ కేసుల్లో బెయిల్ కోసం దరఖాస్తు చేశారు? కాంగ్రెస్ నాయకత్వం ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పి తీరాలి. మీ అందరికీ తెలుసు. కాంగ్రెస్ తల్లీ కొడుకులపై రూ.5000 కోట్ల ఆరోపణలున్నాయి. అధినేతలు బెయిల్పై ఉన్న పార్టీ ఇప్పుడు మమ్మల్ని ప్రశ్నిస్తోందా?" అని ఆయన దుయ్యబట్టారు.
బాగల్కోటె జిల్లా ముథోళ్ కు చెందిన జాతి శునకాలు సైన్యంలో సేవలందిస్తూ తమ దేశభక్తిని చాటుకుంటున్నాయని, వీటిని చూసైనా కాంగ్రెస్ నేతలు నేర్చుకోవాలని హితవు పలికారు.