తెలంగాణ ఏసీబీని అడ్డుపెట్టుకుని సీఎం కేసీఆర్ తన రాజకీయ ప్రత్యర్థులను దెబ్బ తీయబోతున్నారా.. తనకు పక్కలో బల్లెంలా మారుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి వంటి కాంగ్రెస్ నేతలను ఏసీబీతో చెక్ పెట్టబోతున్నారా.. అంటే అవుననే అనిపిస్తోంది. కేసీఆర్ ఉన్నట్టుండి ఏసీబీ అధికారుతో బేటీ కావడం గంటల తరబడి చర్చించడం ఉత్కంఠ రేపుతోంది.
చంద్రబాబును ఇరుకున పెట్టే ఓటుకు నోటు తోపాటు.. పలు కీలక కేసులను కేసీఆర్ అధికారులతో చర్చించారట. ఆ కేసుల పురోగతి ఏంటి.. ఎందుకు ఆగాయి.. ఇప్పుడు ఏం చేయాలి.. అని దాదాపు 5 గంటల సేపు చర్చించారట. ఈ కేసుల్లో కీలకమైనవి ఉన్నాయి. చంద్రబాబుపై ఉన్న ఓటుకు నోటు, ఐఎంజీ భారత్ కేసులతో పాటు... పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డికి సంబంధించి ఇళ్ల నిర్మాణ అవకతవకలు, ఎన్నికల్లో నగదు పట్టివేతపై కూడా కేసీఆర్ ఆరా తీశారట.
కాంగ్రెస్ హయాంలో బలహీనవర్గాలకు ఇళ్ల కేటాయింపులో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది.ఉత్తమ్కుమార్రెడ్డి అప్పట్లో గృహనిర్మాణ శాఖ మంత్రిగా పనిచేయటం, 2014 ఎన్నికల సమయంలో ఆయన కారులో నగదు లభించిన కేసు విషయమై కూడా కేసీఆర్ కూపీ లాగారట. పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలంలో... దళితులకు కేటాయించిన అసైన్డ్ భూములను తీసుకున్న అంశం కూడా సమావేశంలో చర్చకు వచ్చిందట.
ఓటుకు నోటు కేసుతో పాటు పలువురు రాజకీయ నాయకులకు సంబంధం ఉందని భావిస్తున్న ఆయా కేసుల స్థితి తెలుసుకున్న సీఎం వాటికి సంబంధించి ప్రభుత్వం తరపున ఎలా ముందుకు వెళ్తే బాగుంటుందనే విషయమై ఆలోచించాలని అధికారులను ఆదేశించారు. రాజకీయ ప్రత్యర్థులు తనపై అనవసర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో వారి గతాన్ని తవ్వడం ద్వారా రాజకీయంగా, నైతికంగా పైచేయి సాధించవచ్చని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.