సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పాటు చేసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాన్ గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ‘జనసేన’ పార్టీ స్థాపించారు. అయితే అప్పుడు ప్రత్యేక్షంగా ఎన్నికల్లో పాల్గొనకుండా బీజేపీ, టీడీపీలకు సపోర్ట్ చేశారు. ఈ నాలుగు సంవత్సరాలు ప్రజల తరుపు నుంచి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వచ్చారు. కాగా, వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాన్ తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యక్షంగా పాల్గొనబోతున్న విషయం తెలిసిదే. అందుకోసం ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పార్టీ బలోపేతనం చేయడానికి కృషి చేస్తున్నారు.
ఇప్పటికే ఏపి, తెలంగాణ లో రెండు పర్యాయాలు యాత్ర చేశారు. పవన్ కల్యాణ్ మరోమారు ఏపీ యాత్రకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలోని దాదాపు అన్ని నియోజకవర్గాలను కలిపేలా యాత్రకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో యాత్ర పేరు, షెడ్యూలు, ప్రారంభ తేదీ, యాత్ర ఎక్కడి నుంచి ప్రారంభం కానుంది? అనే విషయాలను జనసేన వెల్లడించనుంది. యాత్రలో భాగంగా స్థానిక సమస్యలను గుర్తించడంతోపాటు పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడమే ప్రధాన లక్ష్యంగా ఈ యాత్ర చేపడుతున్నట్టు తెలుస్తోంది.
వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని స్థానాల నుంచి పోటీ చేస్తామని ఇప్పటికే పవన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పర్యటన ద్వారా పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే పవన్ ఈ యాత్ర చేపడుతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే రేపు భారత్లో మొట్టమొదటి తిరుగుబాటు ప్రారంభమైన రోజు మే 10, 1857. ఆ పోరాట స్ఫూర్తితో భారతావనిలో ఎన్నో ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగసి సుదీర్ఘ పోరాటం తరువాత చివరకు ఆగస్టు 15, 1947లో భారత్ స్వాతంత్ర్యం సాధించింది.
తొలి స్వాతంత్ర పోరాటంగా చరిత్రకారులు పేర్కొనే ఆ సిపాయిల తిరుగుబాటును తలుచుకుంటూ రేపు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఓ భారీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆ పార్టీ తెలిపింది. రేపు ఉదయం 10 గంటలకు ప్రపంచ అతిపెద్ద భారత జాతీయ పతాకాన్ని (22,326 చ.అడుగులు) ఎగురవేయనున్నట్లు పేర్కొంది.