ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా అనేది మూసుకుపోయిన అధ్యాయం అన్న రోజే ఆ విషయం పై చంద్రబాబు తన సర్వహక్కులు కోల్పోయారు. ప్రత్యేక పాకేజి ని తానెంతో గొప్పగా కేంద్రాన్ని ఒప్పించానని హోదా ఒక్కటే సంజీవని కాదని ఈ పాకేజ్లో అంతకు మించిన వరాల మాల ఉందని ఊదరగొట్టి మరీ జనాన్ని ఒప్పించిన చంద్రబాబు ఇప్పుడు మళ్ళీ యు-టర్న్ తీసుకొని కేంద్రంతో పితలాటకం పెట్టుకోవటమే ఆయన అతి నీచాతి నీచ రాజకీయాన్ని బట్టబయలు చేసింది. అయితే ఆయనకు ప్రత్యేక హోదా పై చిత్త శుద్దిలేదని ఉండవల్లి తొలి నుంచీ చెపుతూనే ఉన్నారు. ఆయన మాటల్లోనే:
"రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మొదటి నుంచీ పోరాటం చేస్తున్నారు. ఆయన బాట లోనే ఇతర ప్రతిపక్షాలన్నీ వచ్చాయి. ప్రత్యేక హోదా ఒక సెంటిమెంట్గా మారింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరమని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్న వైఎస్ జగన్కు ఆ క్రెడిట్ వస్తుందనే సీఎం చంద్రబాబు చివరి ఏడాది ప్రత్యేక హోదాపై పోరాటం అంటూ ఫీట్లు చేస్తున్నారు" అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ వ్యాఖ్యానించారు.
విభజన సమయంలో లోక్సభలో జరిగిన ప్రహసనంపై వచ్చే శీతాకాల సమావేశంలో నోటీసులు ఇవ్వాలని, విభజనపై తాను సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అఫిడవిట్ దాఖలు చేయాలని కోరుతూ సీఎం చంద్రబాబుకు ఆయన రాసిన లేఖను శుక్రవారం విడుదల చేశారు.
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఉండవల్లి విలేకరులతో మాట్లాడుతూ "నాలుగేళ్లుగా ప్రత్యేక హోదాతో ఏం వస్తుందన్నారు. ప్రత్యేక హోదా ఏమైనా సంజీవనా? అని ప్రశ్నించారు. ఇక ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమన్నారు. రానున్న ఎన్నికలకు ఏడాది సమయం మాత్రమే ఉందనగా ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం పోరాడుతోంది తానేనంటూ 11 పచ్చ చానళ్ల ద్వారా విపరీత ప్రచారం చేసుకుంటున్నారు. 25 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తామంటున్నారు. ఇప్పుడు మాత్రం ఎంపిల సంఖ్య తో పనేంటి ప్రతిపక్ష ఎంపిలు మీకు సహాయం చేస్తామన్నపుడు మీరు ముందుకు రాలేదుకదా! ఇంకొక సారి 25 మంది మీ ఎంపిలను ఏపి గెలిపించటమనేది కలలో మాట. బీజేపీ అప్పడు కూడా కేంద్రంలో అధికారంలోనో, లేక ప్రతిపక్షంలోనో ఉంటుంది. మీపై కక్షతో ఇప్పుడు అడ్డుకుంటే రేపు కూడా అడ్డుకోదని గ్యారెంటీ ఉందా?" అని ప్రశ్నించారు.
"రాష్ట్రం వెలిగిపోతోంది. 2029 ముందే ప్రపంచంలోనే నంబర్-వన్ రాష్ట్రం అవుతుంది. గుజరాత్ కన్నా మనం ముందుకు పోతాం కాబట్టే అణిచి వేస్తున్నారు. జీడీపీలో దేశం కన్నా మనమే టాప్ అంటూ ఫోజులు కొడుతుంటే, అంతా బాగున్నవారికి హోదా ఎందుకు అని ఎవరైనా అనుకుంటారు. దేబిరించాల్సిన సమయంలో కాలు మీద కాలేసు కుని ఫోజులు కొడితే ఎలా?" అని ఉండవల్లి సీఎంని ప్రశ్నించారు. విభజనకు సంబంధించి లోక్సభ శీతాకాల సమావేశాల్లో నోటీసులిస్తే, రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి మీరంటే మీరే కారణమంటూ బీజేపీ, కాంగ్రెస్ దుమ్మెత్తి పోసుకుంటాయని, ఇలా అయినా రాష్ట్రానికి జరిగిన అన్యాయం దేశం మొత్తం తెలుస్తుందన్నారు.