కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి శనివారం ఎన్నికలు ముగిసిన గంట వ్యవధిలోనే ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో కాంగ్రెస్కు 93 నుంచి 103 స్థానాలు, బీజేపీకి 83 నుంచి 93 స్థానాలు లభించాయి. ఫలితంగా రాష్ట్రంలో టఫ్ ఫైట్ సాగిందని ఎగ్జిట్ పోల్ స్పష్టం చేసింది. నిజానికి ఇటీవల వరకు పలు సర్వే సంస్థలు వెల్లడించినట్టుగా రాష్ట్రంలోఏ పార్టీకీ స్పష్టమైన మెజారీటీ రాలేదు. అయితే, ఎన్నో ఆశలు పెట్టుకున్న బీజేపీని మాత్రం కాంగ్రెస్ తనదైన శైలిలో దెబ్బకొట్టింది. ఇప్పడు ఇక, ఈ రాష్ట్రంలో అధికారం ఏర్పాటు చేయబోయే పార్టీకి ఇండిపెండెంట్లే దిక్కయ్యేలా ఉన్నారని తాజా ఎగ్జిట్ పోల్ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.
‘పీపుల్స్ పల్స్’ సంస్థ తాజాగా వెల్లడించిన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో కాంగ్రెస్-బీజేపీలు నువ్వా నేనా అనే రేంజ్లో రెచ్చిపోయాయి. అయినప్పటికీ.. పాలకపక్ష కాంగ్రెస్ పార్టీయే అత్యధిక సీట్లను గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని, ఆ తర్వాత స్థానాన్ని భారతీయ జనతా పార్టీ, తతీయ స్థానాన్ని జనతాదళ్ సెక్యులర్ పార్టీ దక్కించుకుంటుందని సర్వేలో వెల్లడైంది. రాజకీయ పరిశోధనా సంస్థ ‘పీపుల్స్ పల్స్’ సిబ్బంది, కన్నడ దిన పత్రిక ‘కోలర్వాణి’ సహకారంతో ఏప్రిల్ 27వ తేదీ నుంచి మే 9వ తేదీవరకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు తిరిగి, దాదాపు 3,600 కిలోమీటర్లు ప్రయాణించి ఈ సర్వేను నిర్వహించింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని, వివిధ వర్గాల ప్రజల అభిప్రాయలను సేకరించడం, వివిధ ప్రశ్నలకు సమాధానాలు రాబట్టడం ద్వారా ఈ సర్వే రిజల్టును వెల్లడించింది.
ఎన్ని సర్వేలు ఎలాంటి ఫలితాలు చెప్పినా చివరికి గెలుపు తమదేనన్న కమలనాథులకు కూడా ఈ ఫలితాలు షాకిచ్చాయి. వాస్తవానికి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యాక ఒకటి రెండు రోజుల్లో నిర్వహించిన సర్వేకు తాజాగా ఈ సర్వేకు మధ్య చాలా తేడా ఉంది. ఈ సర్వే.. ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చాకే కాకుండా ప్రధానంగా బీజేపీ నేతలు అమిత్ షా.. ప్రధాని నరేంద్ర మోడీలు ప్రచారంలో పాల్గొన్న తర్వాత మారిన పరిస్థితులను అంచనా వేస్తూ.. ఈ సర్వే సాగింది.
ప్రధాని చెప్పినట్టుగా రాష్ట్రంలో 10% కమీషన్ ఎంత మేరకు ఎన్నికలను ప్రభావితం చేసిందో కూడా సర్వే వెల్లడించడం గమనార్హం.
అదేవిధంగా యడ్యూరప్పపై కాంగ్రెస్ ఉత్తుత్తినే కేసులు పెట్టిందన్న ప్రధాని మోడీ వ్యాఖ్యలను కన్నడిగులు పెద్దగా విశ్వసించలేదని కూడా ఈ సర్వే ఎగ్జిట్ పోల్లో స్పష్టంగా కనిపించింది. అదేసమయలో సిద్దూ పాలనకు ప్రజల్లో 50% మందికిపైగా మరోసారి పచ్చజెండా ఊపడం గమనార్హం. అయితే, ఈ దఫా మాత్రం ఏ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేకుండా పోయిందనే విషయం స్ఫష్టంగా ఈ ఎగ్జిట్ పోల్ వివరించిందని నిర్వాహకులు పేర్కొన్నారు.
అదేవిధంగా ప్రధాని మోడీ ప్రవేశ పెట్టిన విధానాలపై ఒకింత వ్యతిరేకత, ఆగ్రహం కూడా ఎన్నికల్లో కనిపించిందని అంటున్నారు. నోట్లరద్దును కొన్నిచోట్ల తీవ్రంగా వ్యతిరేకించగా.. మరికొందరు స్వాగతించారు. ఇక, జీఎస్టీని తీవ్రంగా వ్యతిరేకించారు. పెట్రోల్ ధరల పెంపు కూడా ఎన్నికల్లో ప్రభావం చూపించింది. ఏదేమైనా.. ఎన్నికల్లో కాంగ్రెస్ కొంత మేరకు లబ్ధిపొందినా.. పూర్తిస్థాయిలో మెజారిటీ సాధించలేకపోవడం గమనార్హం.
వివిధ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కర్ణాటకలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయంటే...
టైమ్స్ నౌ: కాంగ్రెస్ 90-103, బీజేపీ 80-93, జేడీఎస్ 31-39
ఇండియా టుడే-యాక్సిస్ ఎగ్జిట్ పోల్ : కాంగ్రెస్ 106-118, బీజేపీ 79-92, జేడీఎస్ 22-30
న్యూస్ ఎక్స్-సీఎన్ఎస్ ఎగ్జిట్ పోల్: కాంగ్రెస్ 72-78, బీజేపీ 102-110, జేడీఎస్ 35-39, ఇతరులు 3-4
రిపబ్లిక్ టీవీ : కాంగ్రెస్ 73-82, బీజేపీ 95-114, జేడీఎస్ 32-43, ఇతరులు 2-3
ఆజ్తక్ : కాంగ్రెస్ 106-118, బీజేపీ 79-92, జేడీఎస్ 22-30