అవును! ఇప్పుడు అందరూ దీనిపైనే చర్చ చేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రమైన కర్ణాటక ఎన్నికలపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉత్కంఠ నెలకొన్న విషయం తెలిసిందే. ప్రధానంగా ఈ ఎన్నికలను రెండు అతి పెద్ద జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు సవాలుగా తీసుకోవడం, కీలక నాయకులు రాహుల్, మోడీలు ప్రచారం చేయడంతో ఈ ఎన్నికలకు ఎనలేని ప్రాధాన్యం ఏర్పడింది. మరోపక్క ఏడాదిలో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏ పార్టీ ఇక్కడ మెజారిటీ సాధిస్తుందో అదే ఢిల్లీ గద్దెను ఎక్కుతుందనే ప్రచారం కూడా జరిగింది. దీంతో ఈ ఎన్నికలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఇక, ఇందులోనే రెండో కోణమూ దాగి ఉంది.
ఏపీకి ప్రధాని నరేంద్ర మోడీ.. నిధులు, ప్రత్యేక హోదా ఇవ్వకుండా అన్యాయం చేశారు కాబట్టి.. కర్ణాటకలో ఏపీ ప్రజలు బీజేపీ బుద్ధి చెప్పాలంటూ.. ఏపీ అధికార పార్టీ టీడీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. అదేవిధంగా కాంగ్రెస్ కూడా ఏపీ నుంచి నేతలను అక్కడికి తరలించి మరీ ప్రచారాన్ని ముమ్మరం చేయించింది. ఏపీ నుంచి అనధికారికంగా టీడీపీ తరఫున కొన్ని ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు, జర్నలిస్టు సంఘాలు వెళ్లి కర్నాటకలో ప్రచారం చేశారు. ప్రధానంగా తెలుగు వారు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రచారం ఉద్రుతం చేశారు. ఇక, శనివారం ఎన్నికలు జరిగిపోయాయి. దీంతో ఇప్పుడు ఏపీ నాయకులు, ప్రజా సంఘాలుచేసిన ప్రచారం ఎంత మేరకు ఫలించింది. ఈ వ్యూహం రచించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఎంతమేరకు సక్సెస్ అయ్యారనే చర్చ సాగుతోంది.
ఇదే విషయం తాజాగా వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ లోనూ ప్రతిబింబింది. తెలుగు ప్రజలు కర్ణాటకలో బీజేపీకి అస్సలు ఓటు వేయలేదా? కాంగ్రెస్కే గంపగుత్తుగా ఓట్లేశారా? అని చర్చించుకుంటున్నారు. నిజానికి బీజేపీ ఏపీకి ఎంత మోసం చేసిందో.. రాష్ట్ర విభజన ద్వారా కాంగ్రెస్ కూడా అంతే మోసం చేసినప్పుడు కర్ణాటక ప్రజలు ఈ రెండు పార్టీలకూ ఓటు వేయకుండా స్థానిక పార్టీ జేడీఎస్కు లేదా ఇండిపెండెంట్లకు ఓట్లు వేసి ఉంటారని అనేవారూ ఉన్నారు. ఇదే విషయాన్ని పరిశీలిస్తే.. కర్ణాటకలో తెలుగు వారి ఓట్లు చీలిపోయాయని అంటున్నాయి ఎగ్జిట్ పోల్ ఫలితాలు. ప్రధానంగా ఏపీ నుంచి వెళ్లిన నాయకుల మాటలను అక్కడి తెలుగు వారు వినిపించుకోలేదని ఎగ్జిట్ ఫలితాలు స్పస్టం చేస్తున్నాయి.
శనివారం జరిగిన ఎన్నికల సరళిని బట్టి.. అక్కడ అధికార కాంగ్రెస్ పై ఉన్న వ్యతిరేకతే ప్రతిబింబించిందని, ఏపీ నాయకులు ప్రచారం చేసినట్టు ఏపీకి అన్యాయం చేసిన బీజేపీకి ఓట్లు వేయొద్దన్న పిలుపు పనికిరాకుండా పోయిందని ఎగ్జిట్ ఫలితాలు చెబుతున్నాయి. ప్రధానంగా 38 నియోజకవర్గాల్లో తెలుగు ఓటర్ల ప్రభావం ఉంది. రాజధాని బెంగళూరులో నాలుగో వంతుతెలుగు వారే ఉన్నారు. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ అదరగొట్టినా, ఇక్కడ మాత్రం ప్రజలు బూత్ల మొహం కూడా చూడలేదు. బెంగళూరులో కేవలం 50% మాత్రమే పోలింగ్ జరిగింది.
ఓటు వేయడం ఇష్టం లేక తెలుగు వారు ఇంటికే పరిమితమయ్యారు. ఏపీ నాయకులు, ముఖ్యంగా చంద్రబాబు ఇచ్చిన పిలుపు సంజీవనిలా పనిచేస్తుందని, బీజేపీకి ఓట్లు వేయరని, అదేసమయంలో కాంగ్రెస్కు లేదా ప్రాంతీయ పార్టీ జేడీఎస్కు ఓట్లు పడతాయని అనుకున్నవారికి నిరాశే ఎదురైంది. నిజానికి తెలుగు వారు పూర్తిస్థాయిలో ఎన్నికల్లో పాల్గొని ఉంటే కనీసం 80% పోలింగ్ నమోదై ఉండేదని ఎగ్జిట్ పోల్ చెబుతున్నాయి. మొత్తానికి ఈ పరిణామంతో.. ఏపీ నాయకుల పిలుపునకు కర్ణాటక తెలుగు ఓటరు విలువ ఇవ్వలేదని స్పష్టం అవుతుండడం గమనార్హం. మరి రిజల్ట్ వస్తేనే నిజం ఏంటో తేలుతుంది.