కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోని కాంగ్రెస్ నాయకురాలు, నటి రమ్యపై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు తీవ్ర ఆక్రోశం వ్యక్తమవుతోంది. మండ్యలోని కేఆర్ రోడ్డులోని పీఎల్డీ బ్యాంక్ పోలింగ్ కేంద్రంలో రమ్యకు ఓటు ఉంది. కానీ ఆమె తన ఓటు హక్కు వినియోగించుకోలేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకటీ రెండు తెలుగు సినిమాల్లో కూడా నటించిన రమ్య కన్నడ నాట స్టార్ పొలిటీషియన్. ఒక దశలో దేశంలోని యంగెస్ట్ ఎంపీల్లో ఒకరిగా నిలిచిందీమె.
మండ్యా స్థానం నుంచి ఉప ఎన్నికలో ఎంపీగా గెలిచి అప్పట్లో సంచలనం రేపింది. రాజకీయంగా బిజీ అయిన రమ్య తరచూ తన పొలిటికల్ కామెంట్లతో వార్తల్లోకి ఎక్కుతూ ఉంటుంది. బీజేపీ వాళ్లు ఎప్పుడు ఎక్కడ దొరుకుతారా.. అని ఎదురుచూస్తూ వారిపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ఉంటుంది ఈ మాజీ నటీమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అనేక విమర్శలు చేసిన రమ్యను అనేకులు సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు మండిపడుతున్నారు.
ఓటు వేయలేని రమ్య రాజకీయాల గురించి మాట్లాడే నైతిక విలువలను కోల్పోయారని విమర్శించారు. ఓటు వేయని రమ్య నెంబర్ వన్ సిటిజన్ అంటూ వ్యంగ్యంగా పోస్టులు చేశారు. నీతులు ఎదుటి వారికి చెప్పడం కాదు..తాము కూడా ఆచరించిన వారే నిజమైన నాయకులు అని..ఇలాంటి వారు పొలిటీషియన్ అని చెప్పుకోవడం సిగ్గు చేటు అని నెటిజన్లు మండి పడుతున్నారు.