గుంటూరులో మరో దారుణం చోటు చేసుకుంది. ఓ మైనర్ బాలికపై యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు.రాజీవ్ గృహకల్ప సముదాయంలో నివాసం ఉండే రాజాసింగ్ అనే యువకుడు స్థానిక బేకరీలో పనిచేస్తున్నాడు. మంగళవారం బేకరీలో పని ముగించుకుని ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో ఇంటి ఎదుట ఆడుకుంటున్న ఓ పదేళ్ల చిన్నారిని తనతో పాటు ఇంట్లోకి తీసుకెళ్లాడు. ఇంట్లో బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడటంతో ఆ చిన్నారి గట్టిగా కేకలు పెట్టింది. దీంతో గమనించిన స్థానికులు రాజాసింగ్‌ని పట్టుకుని దేహశుద్ది చేశారు.

అనంతరం అతన్ని పోలీసులకు అప్పగించారు.  స్థానిక పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. కాగా స్థానికులు పోలీసు వారితో గొడవకు దిగారు.. నిందితుడిని తమకు అప్పగించాలంటూ బాలిక తల్లిదండ్రులు, బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.ఈ విషయమై పోలీసులు ఎంతకీ స్పందించకపోవడంతో పోలీస్ స్టేషన్ పై వారు రాళ్ల దాడికి పాల్పడ్డారు.

ఈ సంఘటనలో పోలీస్ స్టేషన్ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసే ప్రమాదం ఉండటంతో ఆందోళనకారులపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. ఈ సంఘటనపై గుంటూరు అర్బన్ ఎస్పీ విజయరావు ఆరా తీస్తున్నారు. ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు గుంటూరు నగరంలో 144 సెక్షన్ విధించినట్టు సమాచారం


మరింత సమాచారం తెలుసుకోండి: