కొద్ది రోజుల కిందట గోదావరిలో లాంచీ అగ్ని ప్రమాదానికి గురైన ఘటన మరవక ముందే.. మరో ఘోర ప్రమాదం మంగళవారం చోటు చేసుకుంది. లాంచీ గోదావరిలో ప్రయాణిస్తున్న సమయంలో సుడిగాలులు వీయడంతో లాంచీ తలుపులు మూసివేశారని, దీంతో లాంచీ అక్కడిక్కడే మునిగిపోయింది. ప్రమాద వార్త తెలియగానే అధికారులు అక్కడికి చేరుకుని గల్లంతైన ప్రయాణికుల కోసం గాలింపులు మొదలుపెట్టారు. ఇటీవల లాంచీ అగ్ని ప్రమాదానికి గురైన ప్రాంతంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.
గోదావరి నదిలో మునకకు గురయిన లాంచీ ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం వాడపల్లి సమీపంలో గోదావరిలో 60 అడుగుల లోతులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భారీ క్రేన్ల సాయంతో లాంచీని వెలికి తీసేందుకు యత్నిస్తున్నారు. కాగా లాంచీలోని పలువురి ప్రయాణికుల మృతదేహాలు ఉన్నట్లు తెలుస్తోంది. సంఘటనస్థలాన్ని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పరిశీలించారు. బాధితులను ఓదార్చారు..అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
ఈ ఘటనలో సుమారు 40 మంది గల్లంతయ్యారని చెబుతున్నారు. ఘటన జరిగిన తీరును చంద్రబాబునాయుడు అధికారులను అడిగి తెలుసుకొన్నారు. రెస్క్యూ టీమ్ చేస్తున్న సహాయక చర్యలను బాబు తెలుసుకొన్నారు. ఇలాంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా అధికారులు సీరియస్ యాక్షన్ తీసుకోవాలని అన్నారు.