రాజకీయాల్లో మనం బలంగా ఉండడమే కాదు.. ఎదుటి వారు బలహీనంగా ఉండడమే ప్రధానం! ఇదే సూత్రంపై రాజకీ యాలు నడుస్తున్నాయి. ముఖ్యంగా అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కత్తిమీద సాము లాంటిదే. అనేక రాజకీయ పార్టీలు, అనేక వ్యూహ ప్రతివ్యూహాలు, అనేక ప్రలోభాలు ఒకటా రెండా? అనేకం! వీటన్నింటినీ తట్టుకుని నిలబడడం ఒక ఎత్తయితే.. ప్రత్యర్థి పార్టీ వేసే ఎత్తులు పై ఎత్తులను తట్టుకుని పరిగెత్తడం అంతా మరో ఎత్తు! ఈ ఎత్తులు పైఎత్తులు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి.
ముఖ్యంగా 2014లో గుజరాత్ నుంచి మెయిన్ స్ట్రీంలోకి వచ్చిన నరేంద్ర మోడీ, అమిత్ షాలు పన్నుతున్న వ్యూహాలు అతి పెద్ద జాతీయ పార్టీ కాంగ్రెస్ను కకావికం చేస్తున్నాయి. వీరి వ్యూహలను తట్టుకుని నిలబడే శక్తి కాంగ్రెస్కు కనిపించడం లేదు. 2014లో దేశంలో ఉన్నతస్థాయిలో ఉన్న కాంగ్రెస్ నేడు పట్టుమని మూడు రాష్ట్రాలకే పరిమితమైంది. పంజాబ్, మిజోరం, పుద్దుచ్చేరి రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ ఉంది. అది కూడా అత్యంత దారుణమైన స్థితిలో కాంగ్రెస్ రాజ్యమేలుతోంది. పంజాబ్లో పొత్తు పెట్టుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఇక, పుదుచ్చేరి కేంద్రం పాలిత ప్రాంతం. అక్కడ బీజేపీ కనుసన్నల్లోని గవర్నర్ కాంగ్రెస్ సీఎం నారాయణస్వామికి చుక్కలు చూపెడుతున్నారు. ఇక, ఈశాన్య రాష్ట్రం మిజోరంలో కాంగ్రెస్ ఉంది. మిగిలిన అతి పెద్ద రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎక్కడా కనిపించడం లేదు. దీనికి తాజా ఉదాహరణ కర్ణాటకే. ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే అతి.. పార్టీ కొంప ముంచింది. ఇదిలావుంటే, మరో ఏడాదిలోనే ఎన్నిలు ఉన్నాయి. తిరిగి అధికారం చేజిక్కించుకోవడం ద్వారా దేశ బీజేపీ చరిత్రలోనే సువర్ణ అధ్యాయాన్ని లిఖించాలని నరేంద్ర మోడీ, షా ద్వయం టార్గెట్గా పెట్టుకుంది. మరి దీనిని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ వంటి అతి పెద్ద పార్టీ చేస్తున్న ప్రయత్నాలు ఏమిటి? అంటే జీరో అనే ఆన్సరే వస్తోంది.
ఇప్పుడున్న నాయక త్వమే అంటే.. రాహుల్ గాంధీనే ఉంటే .. బంగారు పళ్లెంలో పెట్టి అధికారాన్ని మోడీకి అప్పగించడమే అనే టాక్ వస్తోంది. ఆయన కానీ మారకపోతే.. పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని కూడా చెబుతున్నారు. ఎన్నికల వ్యూహాన్ని సిద్ధం చేయడం లోను, ఎన్నికల్లో ముందుండి నాయకులను నడిపించడంలోను ప్రధాని మోడీని ఇరుకున పెట్టడంలోను కూడా రాహుల్ వెనుకబడి పోయారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్లో రాహుల్ ఉంటే పెను ప్రమాదం కొని తెచ్చుకున్నట్టేన ని అంటున్నారు కాంగ్రెస్ సీనియర్లు