రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిలప్రియ ముఖ్యమంత్రి చంద్రబాబును కలసి తన వివాహ వేడుకకు హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారు. సిఎం చంద్రబాబును ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలుసుకున్న భూమా అఖిల ప్రియ వివాహ ఆహ్వాన పత్రికను అందించి కుటుంబంతో సహా వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరారు. టీవలే హైదరాబాదులో ఆమె వివాహ నిశ్చితార్థం జరిగింది. భార్గవ్ ను ఆమె పెళ్లాడబోతున్నారు. గత కొంత కాలంగా వీరు ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, తన కాబోయే భర్త భార్గవ్ తో కలసి ముఖ్యమంత్రి చంద్రబాబును ఆమె కలిశారు.
ఆగస్ట్ 29న తమ వివాహం ఆళ్లగడ్డలో జరగనుందని, రావాలని కోరారు. ఈ సందర్భంగా ఇద్దరినీ ముఖ్యమంత్రి ఆశీర్వదించారు. ఇదిలా ఉంటే.. గోదావరి పడవ ప్రమాదం నేపధ్యంలో మంత్రి అఖిల ప్రియ ఎక్కడా కనిపించక పోవడం విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే.
సంఘటన జరిగి రోజులు గడుస్తున్నా మంత్రి ఘటనా స్థలానికి వెళ్లలేదని, సహాయక చర్యలను ఏమాత్రం పర్యవేక్షించలేదని...అసలు మంత్రి అడ్రస్ ఎక్కడంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు.
ఈ నేపథ్యంలో మంత్రి అఖిల ప్రియ తన వివాహ ఆహ్వాన పత్రికను ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేసేందుకు రావడంతో ఆ విమర్శలకు బ్రేక్ పడినట్లయింది. ఈ సందర్భంగా అఖిలప్రియ సోదరుడు, నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి కూడా వారి వెంట ఉన్నారు.