ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలో అధికార టీఆర్ఎస్ పార్టీ మూడు ముక్కలైంది. నేతల తీరుతో గులాబీ దండు మూడువర్గాలు విడిపోయింది. రోజురోజుకూ ముదురుతున్న ఈ వివాదాన్ని పార్టీ అధిష్టానం కూడా పట్టించుకోకపోవడంతో క్యాడర్కూడా తీవ్ర నిరాశలో పడిపోయినట్లు సమాచారం. ప్రధానంగా వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసమే ఈ లొల్లి సాగుతోందనే టాక్ వినిపిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, రాష్ట్ర నాయకుడు రాజారపు ప్రతాప్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గమంటోంది. ఇరువర్గాల మధ్య తరుచూ ఘర్షణ వాతావరణం నెలకొంటోంది. ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు, విమర్శలతో పార్టీ క్యాడర్ కూడా అయోమయంలో పడిపోయింది.
ఇదిలా ఉండగా... డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కూడా వచ్చే ఎన్నికల్లో స్టేషన్ఘన్పూర్ నుంచి తన కూతురు కావ్యను బరిలోకి దించాలనే పట్టుదలతో పావులు కదుపుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్య, రాష్ట్ర నాయకుడు రాజారపు ప్రతాప్ వర్గాలు పార్టీ చీలిపోయింది. ఇందులో కడియం శ్రీహరి కూడా తన వర్గాన్ని తయారు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఈ ముగ్గురిలో టికెట్ ఎవరికి దక్కుతుందన్నదానిపై ఇప్పటి నుంచి తీవ్ర ఉత్కంఠ నెలకొంటోంది. ఇందులో ఎవరికి టికెట్ దక్కకపోయినా తీవ్ర పరిణామాలు ఉంటాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇదిలా ఉండగా.. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే వస్తున్న పంచాయతీ ఎన్నికలతో ఈ పరిస్థితి మరింత సీరియస్గా మారే అవకాశాలూ లేకపోలేదు. అభ్యర్థుల ఎంపిక విషయంలో ఎవరివర్గాలకు వారు టికెట్లు ఇప్పించుకునేందు పోటీపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇటీవల రఘునాథపల్లి మండలం కంచనపల్లిలో జరిగిన ఘటన రాజయ్య, ప్రతాప్ వర్గాల మధ్య ఆధిపత్య పోరు ఏ స్థాయిలో ఉందో చెబుతుంది. ఇక్కడ జరిగిన రైతుబంధు కార్యక్రమంలో అటు ఎమ్మెల్యే వర్గీయులు, ఇటు ప్రతాప్ వర్గీయులు వేర్వేరుగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
ఈక్రమంలో ఇరు వర్గాల మధ్య లొల్లి జరిగింది. ఇదిలా ఉండగా... తాటికొండ రాజయ్య, ప్రతాప్ మధ్య వర్గపోరును కడియం శ్రీహరే పరోక్షంగా పెంచిపోషిస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. నిజానికి రాష్ట్ర మైనారిటీ కమిషన్ వైస్ చైర్మన్గా ప్రతాప్ను సీఎం కేసీఆర్ నియమించిన కొద్దిరోజులకే ఆయన రాజీనామా చేశారు. అయితే వచ్చే ఎన్నికల్లో ప్రతాప్ టికెట్ ఇచ్చేందుకే సీఎం కేసీఆర్ ఆయనతో రాజీనామా చేయించారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే ఈ పరిణామాలపై పార్టీ అధిష్టానం రిపోర్ట్కూడా తెప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఏదేమైనా అధికార పార్టీ టీఆర్ఎస్కు కంచుకోటగా ఉన్న స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలో ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ కోసం పార్టీ నాయకులు మూడు వర్గాలుగా చీలి మూడు ముక్కలాట పెట్టడంతో వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి పార్టీ టిక్కెట్ ఎవరికి దక్కుతుందో తెలియక ఇటు కేడర్ కూడా వర్గాలుగా చీలిపోతుంటే అటు నియోజకవర్గ ప్రజలు కూడా పెద్ద కన్ఫ్యూజన్లో పడిపోయారు.