కర్ణాటకలో రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. అసెంబ్లీలో బలపరీక్ష నేపథ్యంలో ఏం జరుగుతుందోనని అందరూ ఆసక్తికరంగా ఎదురుచూశారు. అయితే రెండు రోజుల గడువులోనే బలపరీక్ష నిర్వహించాల్సి రావడంతో ఆపరేషన్ కమలం సక్సెస్ కాలేదు. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకోవడంలో బీజేపీ విఫలమైంది. కన్నడనాట ఆపరేషన్ కమలం ప్లాప్ అయితే కాంగ్రెస్ తమ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకుని శభాష్ కాంగ్రెస్ అనిపించుకుంది.
కాగా ఎన్నికల ఫలితాల అనంతరం కనిపించకుండా పోయిన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆనంద్ సింగ్, ప్రతాప్ పాటిల్లు ఈరోజు అసెంబ్లీకి వచ్చి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసిపోవడంతో అనేక ఊహాగానాలకు తెరపడింది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీలో ముఖ్యమంత్రి యడ్యూరప్ప బలపరీక్షకు ముందే నిరుత్సాహపడ్డారు. చివరకు తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఈ నేపథ్యంలో బల నిరూపణకు ముందే ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామా చేస్తారనే వార్త జాతీయ మీడియాలో ముందుగానే వైరల్ అయ్యింది. దీనికి తగ్గట్టుగానే ఆయన రాజీనామా చేసేశారు. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు కట్టుదిట్టమైన భద్రత మధ్య సేఫ్గా ఉంచడంతో చివరి వరకు బీజేపీ వాళ్లను వాళ్లను కొనేందుకు కోట్లాది రూపాయలు ఎరవేసి భేరసారాలు జరిపారు. అయితే చివరకు వీరి ఆశలు నెరవేరలేదు. సభలో బలం నిరూపించుకోలేని పరిస్థితి ఉందనీ, దీంతో యడ్యూరప్ప అంతకుముందే తన సీఎం పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం మధ్యాహ్నం నుంచే జోరుగా జరిగింది.
బలపరీక్షకు ముందే వాజ్పేయి తరహాలో సభలో మాట్లాడి యడ్యూరప్ప ముందుగానే తన రాజీనామా లేఖను సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే అసెంబ్లీ హాలులో కూడా ఉదయం ఉన్నంత కాన్ఫిడెంట్గా సమయం గడిచిన కొద్దీ యెడ్డీలో కనిపించడం లేదు. 104 సీట్లతో అతిపెద్దపార్టీగా అవతరించిన బీజేపీ బలపరీక్షలో నెగ్గాలంటే ఏడుగురు సభ్యులు కావాలి. ఇందుకోసం కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను తమవైపు లాగేందుకు బీజేపీ అన్ని ప్రయత్నాలు చేసి చివరకు విఫలమైంది.
ఈ క్రమంలో బీజేపీ నేతలు కాంగ్రెస్ నేతలతో బేరసారాలు నడిపిన ఆడియే టేపులను కాంగ్రెస్ విడుదల చేయడంతో దేశవ్యాప్తంగా బీజేపీ పరువుపోయింది. నిన్న గాలి జనార్దన్రెడ్డి, నేడు యడ్యూరప్ప, శ్రీరాములు, మురళీధర్రావు కాంగ్రెస్ నేతలతో బేరసారాలు నడిపిన ఆడియే టేపులను కాంగ్రెస్ పార్టీ విడుదల చేయడంతో పెద్దెత్తున దుమారం రేగింది. చివరకు ఇది బీజేపీ పరువును బజారున పడేసి, ఆ పార్టీ ప్రజస్వామ్యాన్ని ఎంత అపహాస్యం చేస్తుందో చెప్పకనే చెప్పింది.
చివరకు మోడీ సైతం ఈ వివాదం పెద్దది అయ్యి పార్టీ పరువు పోయేలా ఉండడంతో యడ్యూరప్పకు ఫోన్ చేసి పదవికి రాజీనామా చేస్తేనే గౌరవం దక్కుతుందని చెప్పినట్టు సమాచారం. ఇప్పటికే గవర్నర్ వాజూభాయ్ వాలా తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. నేపథ్యంలో పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకురావొద్దని ప్రధాని నరేంద్ర మోడీ గట్టిగా సూచించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే యెడ్డీ రాజీనామా చేశారు. అయితే అప్పటికే బీజేపీ చేయాల్సిన చీఫ్ ట్రిక్స్ యావత్ దేశం మొత్తం గమనించడంతో పరువు కాస్త పోయింది.