వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధికసీట్లు గెలిస్తే తానే సీఎం అవుతానని చెప్పుకుంటున్నసీఎల్పీ నేత జానారెడ్డి ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తనయుడి పనితీరుతో కొంత విసుగ్గా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. జానారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఈసారి రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత అయిన జానాను ఈసారి ఎలాగైనా ఓడించాలన్న పట్టుదలతో అధికార టీఆర్ఎస్ పార్టీ ఇప్పటి నుంచి పకడ్బందీగా పావులు కదుపుతోంది. ఈ క్రమంలోని నియోజకవర్గంలో పలువురికి గులాబీ కండువాలు కప్పింది కూడా. ఇదిలా ఉండగా.. టీఆర్ఎస్ నుంచి నోముల నర్సింహయ్య, ఎంసీ కోటిరెడ్డి కూడా టికెట్ రేసులో ఉన్నారు.
అయితే నాగార్జున సాగర్ నియోజకవర్గంలో కొన్ని నెలల కిందట జానారెడ్డి తనయుడు రఘువీర్రెడ్డి పాదయాత్ర చేపట్టారు. గ్రామాల్లో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వారికి దగ్గరయ్యేందకు ప్రయత్నించారు. అయితే వారం తిరక్కుండానే అర్థంతరంగా యాత్ర ఆపేశారు. దీంతో కార్యకర్తలు తీవ్ర నిరూత్సాహానికి గురయ్యారట. మళ్లీ ఇటీవల నియోజకవర్గంలో తిరగడం మొదలుపెట్టిన రఘువీర్రెడ్డి మళ్లీ సీన్ రిపీట్ చేశారు. దీంతో ఆయన వ్యవహార శైలిపై జానారెడ్డితోపాటు, పార్టీ క్యాడర్ కూడా తీవ్ర అసహనంతో ఉన్నారట. ఇదే సమయంలో అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా వేగంగా ప్రజజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తోంది. ఈ పరిస్థితులను తనకు అనుకూలంగా మర్చుకుంటోంది.
గత ఎన్నికల్లో జానారెడ్డి తన తనయుడు రఘువీర్రెడ్డికి మిర్యాలగూడ నుంచి టికెట్ ఇప్పించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నం చేశారు. అయితే ఒక కుటుంబంలో ఒకరికే టికెట్ ఫార్ములా పార్టీ అధిష్టానం ముందుకు తేవడంతో టికెట్ ఇప్పించుకోలేకపోయారు. దీంతో జానా కీలక అనుచరుడు భాస్కర్రావుకు టికెట్ దక్కింది. కానీ, ఆయన గెలిచిన తర్వాత అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. ఇలా జానాకు గత ఎన్నికల నుంచి అస్సలు కలిసిరావడం లేదు. ఇప్పుడు రఘువీర్రెడ్డి ప్రజల్లో నిత్యం ఉండకపోవడంతో పరిస్థితులు మరింత కష్టంగా మారే ప్రమాదం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇంతకు వచ్చే ఎన్నికల్లో రఘువీర్రెడ్డికి టికెట్ దక్కుతుందో లేదో చూడాలి మరి.