జనసేనాని పవన్ కళ్యాణ్కు ఊహించని పరిణామం ఎదురైంది. ఆయన ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో 45 రోజుల బస్సు యాత్ర ప్రారంభించారు. గత రెండు రోజులుగా ఆయన యాత్రలోనే ఉన్నారు. వివిధ వర్గాల ప్రజలను కలసివారి సమస్య లు తెలుసుకుంటున్నారు. యాత్ర చేస్తున్న ప్రాంతంలోనే ఆయన బస చేస్తున్నారు. ప్రతి ఒక్కరినీ పలక రించి వారి తో మాట్లాడి భరోసా ఇస్తున్నారు. గతంలో తాను టీడీపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నదీ వివరిస్తున్నారు. రాబోయే రోజుల్లో తన వ్యూహం ఏంటో కూడా పవన్ వివరిస్తన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన యాత్ర మంగళవారం నాటికి శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గకు చేరుకుంది. ఇక్కడ ఆయన బహిరంగ సభ నిర్వహించారు. అధికార పార్టీ, విపక్షాలపై నిప్పులు చెరిగారు.
175 స్థానాల్లోనూ తాను పోటీ చేస్తానని 25 ఎంపీ స్థానాల్లోనూ తన నాయకులు బరిలోకి దిగుతారని, వారిని గెలిపించాలని పవన్ కోరారు. అప్పుడే రాష్ట్రంలో అవినీతి పాలన అందుతుందని కూడా వెల్లడించడం సంచలనంగా మారింది ఇక, మంగళవారం రాత్రి.. పవన్.. కాశీబుగ్గలోనే బస్స చేశారు. దీనికిగాను తనకు తన పరివారానికి కలిపి ఓ ప్రైవేటు కళ్యాణ మండపాన్ని చూసుకుని అందులో దిగారు. అయితే, అనూహ్యంగా రాత్రి పొద్దు పోయిన తర్వాత కొందరు కాంట్రాక్టు విద్యుత్ సిబ్బంది.. తమ సమస్యలు వినిపించుకునేందుకు పవన్ బస చేసిన ప్రాంతానికి వచ్చారు. అయితే, అప్పటికే పవన్ అలిసిపోవడం, నిద్రకు ఉప క్రమించడంతో ఆయన సహాయకులు, అంగ రక్షకులు కూడా ఈ సిబ్బందిని నిలువరించారు.
పవన్తో ఏదైనా మాట్లాడాలంటే.. ఉదయాన్నే రావాలని, ఇప్పుడు ఆయన నిద్రకు ఉపక్రమించారని అన్నారు. అయినప్పటికీ.. సిబ్బంది మాట వినిపించుకోకుండా.. పవన్ కల్యాణ్ బయటకు రావాలని నినదించారు. ఈ సమయంలో పవన్ కల్యాణ్ బయటకు రారని, బుధవారం ఉదయం వస్తే కలవవచ్చని వారితో కల్యాణమండపం వద్ద కాపలా ఉన్న ప్రైవేటు సిబ్బంది చెప్పారు. ఆయన ఎలా బయటికి రారో చూస్తామంటూ విద్యుత్తు సరఫరాను సిబ్బంది నిలిపేశారు. దీంతో ఇరువర్గాల మధ్య వాదోపవాదాలు జరిగి కొట్లాటకు దారితీసింది. పవన్ కల్యాణ్ బౌన్సర్ సునీల్ కాలికి గాయమైంది.
కాశీబుగ్గ సీఐ అశోక్కుమార్ ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం కల్యాణమండపానికి విద్యుత్తు సరఫరాను సిబ్బంది పునరుద్ధరించారు. ఈ వివాదం తీవ్ర రూపం దాల్చే సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. మరోపక్క, రాజకీయ నాయకుడు అంటే.. సమస్యలు చెప్పుకొనేందుకు వచ్చే ప్రజలకు ఎప్పుడైనా అప్పాయింట్ మెంట్ ఇచ్చేలా ఉండాలని బౌన్సర్లను రంగంలోకి దింపి భయభ్రాంతులకు గురి చేయడం ఏంటి? అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరి పవన్ ఎలా రయాక్ట్ అవుతాడో చూడాలి.