తెలంగాణ ప్రభుత్వం ఏర్పాడిన తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి ఎన్నో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. పేద వారి ఆర్థిక అవసరాల కోసం కొత్త కొత్త పథకాలు తీసుకు వచ్చారు. రీసెంట్ గా రైతుల కోసం ‘రైతుబంధు’ పథకాన్ని ప్రారంభించారు. అంతేకాదు తెలంగాణలో వచ్చే ప్రతి పండుగ ఎంతో గొప్పగా జరుపుతున్నారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఇలా అన్ని మతాల పండుగ బహుమానాలు ఇస్తున్నారు. రంజాన్ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ముస్లింల కోసం కొత్త కార్యక్రమాన్ని చేపట్టనుంది. సుమారు 4 లక్షల నిరుపేద ముస్లిం కుటుంబాలకు కొత్త బట్టలన ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది.
800 మసీదు కమిటీల ఆధ్వర్యంలో రంజాన్ కానుకల పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో 400, హైదరాబాద్లో 400 మసీదులను గుర్తించింది. ప్రతిమసీదు పరిధిలో 500 పేద కుటుంబాలను ఎంపిక చేసి మూడు జతల కొత్త దుస్తులున్న ప్యాకెట్లను పంపిణీ చేయనుంది. ఒక్కోదానిలో రూ.525 విలువ గల కుర్తా, పైజామా, సల్వారు, కమీజు, చీర, బ్లౌజ్ అందించనుంది. కానుకల పంపిణీ కార్యక్రమాన్ని మైనారిటీ సంక్షేమ శాఖ, వక్ఫ్బోర్డు అధికారులు పర్యవేక్షిస్తారు.
ఇప్పటికే ప్రభుత్వం తెలంగాణ హ్యాండ్లూమ్ అండ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ(టెస్కో)తో రంజాన్ దుస్తుల కోసం అగ్రిమెంట్ చేసుకుంది. కొత్త బట్టల కోసం సుమారు రూ.21 కోట్లను ఖర్చు చేస్తోంది. 800 మసీదుల్లో దావతే ఇఫ్తార్ విందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
గ్రామీణ ప్రాంతాల్లో 400, GHMC ఏరియాలో 400 మసీదుల్లో దావతే ఇఫ్తార్ విందు ఏర్పాట్లకు చర్యలు చేపట్టింది. ప్రతి నియోజకవర్గానికి 4 మసీదుల చొప్పున ఎంపిక చేసి 4 లక్షల మందికి విందు ఏర్పాటు చేస్తోంది. ఇందు కోసం మసీదుకు లక్ష రూపాయల చొప్పున మొత్తం రూ.8 కోట్లు ఖర్చు చేయనుంది. రంజాన్ కానుక, దావతే ఇఫార్త్కు కలిపి ప్రభుత్వం రూ.30 కోట్లను మంజూరు చేసిన విషయం విదితమే.