కర్ణాటక అసెంబ్లీ స్పీకర్గా కాంగ్రెస్ అభ్యర్థి రమేశ్ కుమార్ ఎన్నికయ్యారు. స్పీకర్ స్థానం కోసం బీజేపీ అభ్యర్థి సురేశ్ కుమార్ నామినేషన్ను ఆ పార్టీ అనూహ్యంగా ఉపసంహరించుకోవడంతో రమేశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా చివరి నిమిషంలో బీజేపీ పోటీ నుంచి తప్పుకుంది. దీంతో స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమైంది. రమేష్ కుమార్ శ్రీనివాసపురం నియోజకవర్గం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎస్ఎం కృష్ణ ప్రభుత్వ హాయంలో స్పీకర్ గా పనిచేశారు.
సిద్ధరామయ్య ప్రభుత్వంలో ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. స్పీకర్ స్థానం కోసం విధాన సౌధలోని అసెంబ్లీ సెక్రటరీ ఎస్ మూర్తికి గురువారమే నామినేషన్ పత్రాలు సమర్పించారు. కర్ణాటక స్పీకర్గా కాంగ్రెస్-జేడీఎస్ పార్టీలు రమేశ్కుమార్ను ఏకగ్రీవంగా బలపర్చాయి.నూతన సభాపతికి ముఖ్యమంత్రి కుమారస్వామి సాదర స్వాగతం పలికారు. సభ్యులంతా కలిసికట్టుగా సభాపతిని ఎన్నుకోవడం హర్షణీయమనీ... రమేశ్ కుమార్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని పేర్కొన్నారు.
1994 నుంచి 1999 వరకు సభాపతిగా ఉన్న రమేశ్... స్పీకర్ స్థానానికి వన్నెతెచ్చారు. ఇప్పుడు కూడా అదే ఒరవడిని కొనసాగిస్తారని ఆశిస్తున్నాను.. అని పేర్కొన్నారు. కాగా నూతన సభాపతికి బీజేపీ సభాపక్ష నేత యడ్యూరప్ప, డిప్యూటీ సీఎం జి పరమేశ్వర, మాజీ సీఎం సిద్ధరామయ్య సహా ఎమ్మెల్యేలంతా శుభాకాంక్షలు తెలిపారు.