కేంద్ర మాజీ మంత్రి, సికింద్రాబాద్ బీజేపీ పార్లమెంటు సభ్యుడు బండారు దత్తాత్రేయ ఒక్కగానొక్క కుమారుడు వైష్ణవ్ హఠాన్మరణం వార్త తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎంబీబీఎస్ చదువుతూ బంగారు భవిష్యత్తుకి బాటలు వేసుకొంటున్న వైష్ణవ్ చిన్న వయసులోనే గుండెపోటుతో కన్ను మూయడం బాధాకరం. పలువురు రాజకీయ నాయకులు, సెలబ్రెటీలు దత్తాత్రేయగారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్న వైష్ణవ్ మంగళవారం రాత్రి భోజనం చేస్తున్న సమయంలో హఠాత్తుగా కుప్పకూలిపోయారు. వైష్ణవ్ను సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించగా అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో తుదిశ్వాస విడిచారు. ఏకైక కుమారుడి హఠాన్మరణంతో దత్తన్న, ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
ఒక్కగానొక్క కుమారుడ్ని కోల్పోయి తీవ్ర శోకంతో ఉన్న బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఓదార్చారు.ఈ వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వైద్య విద్య పూర్తి చేసి దేశానికి సేవ చేయాల్సిన వైష్ణవ్ మృతి చెందడం బాధాకరమన్నారు. ఈ మేరకు దత్తాత్రేయ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతూ ప్రధాని మోదీ లేఖ పంపించారు.