ఎన్నికల రాజకీయ నాటకాలు అసలు రక్తిగట్టేది కర్ణాటకలోనే. కొత్త సంసారం మొదలు పెట్టిన కాంగ్రెస్-జేడీఎస్ లు అప్పుడే గిల్లికజ్జాలు పెట్టుకొని కొట్టు కుంటున్నాయి. కానీ ఈ కొట్లాట ప్రభుత్వం విషయంలో మాత్రం కాదు, ఎన్నికల తరవాత అత్తెసరు మార్కులతో పాసైన మొద్దబ్బాయి జెడిఎస్ తో, డిస్టింగ్షన్ తో పాసైనా, కాంగ్రెస్ పొత్తు పెట్టుకొని కర్ణాటకలో తన శిరస్సును జెడిఎస్ పాదాల చెంత పెట్టి తన ఆత్మాభిమానాన్ని సైతం వదిలేసి బిజెపిని నిలువరించటానికి అధికారం పంచుకున్న రెండు పార్టీలు, ఇప్పుడు ఉప ఎన్నికల్లో వేరు వేరుగా పోటీచేస్తూ తీవ్రాతి తీవ్రంగా విమర్శలు చేసుకోవడం "ప్రతిపక్ష బీజేపీకి కన్నుల పండగ" గా మారింది.
తాజాగా కర్ణాటకలో వివిధ కారణాలతో వాయిదా వేసిన రామనగర - జయనగర్ - ఆర్ఆర్ నగర్ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నియోజకవర్గాల్లో జయనగరలో బిజెపి ఎమెల్యే అభ్యర్ధి బిఎన్ విజయకుమార్ మరణంతో, మిగిలిన వాటిలో విచ్చలవిడిగా డబ్బు-మద్యం-ఓటు గుర్తింపు పత్రాలు చోరీకి గురై పట్టుబడటంతో ఎన్నికలను వాయిదా వేశారు.
అయితే ప్రభుత్వంలో కలిసి ఉన్న కాంగ్రెస్-జేడీఎస్ లు ఈ నియోజకవర్గాల్లో విడిగా పోటీ చేస్తున్నాయి. నువ్వా? నేనా? అన్నట్టు ప్రచారం చేసుకుంటున్నాయి. ఆర్ఆర్ నగరలో అయితే దేవెగౌడ ప్రచారం చేసి కాంగ్రెస్ నే తిట్టిపోస్తున్నారు. ప్రభుత్వంలో మాత్రమే పొత్తులో ఉన్నామని, ప్రభుత్వ వెలుపల-భవిష్యత్తులో గాని పొత్తు కొనసాగు తుందని చెప్పలేమని, స్పష్టం చేశారు.
అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ లేదా జేడీఎస్ ఎమ్మెల్యేలకు గెలుపు అవకాశాలున్నాయట, ఎవ్వరూ గెలిచినా, ప్రస్తుత ప్రభుత్వానికి బలం పెరుగుతుండడంతో ఓటర్లు ఎటు ఓటు వేయాలో తెలియక తికమక పడుతున్నారట.
కాంగ్రెస్-జేడీఎస్ మళ్లీ కర్ణాటక ఎన్నికల్లో యుద్ధానికి దిగడంపై అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. మొన్ననే మమతా బెనర్జీ దేశంలో బలమైన బీజేపీని ఎదుర్కోవా లంటే ప్రాంతీయ పార్టీలు కలిసి పోటీచేయాలని, కాంగ్రెస్-జేడీఎస్ ముందే కలిస్తే అసెంబ్లీ ఎన్నికల్లోనే బీజేపీ మట్టి కరిచేదని సూచించారు. కానీ మమత మాటలను పెడ చెవిన పెట్టిన కాంగ్రెస్-జేడీఎస్ లు మళ్లీ ఇప్పుడు ఎన్నికల్లో పోరుబాటకు దిగడం అంతిమంగా బీజేపీకి లాభం చేకూరుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.