కేంద్రంప్రభుత్వం నుండి తీసుకొన్న ప్రతి పైసాకు లెక్కలు చెప్పాల్సిందేనని బిజెపి పార్లమెంట్ సభ్యుడు, కేంద్ర కమిటీ సభ్యుడు, అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహా రావు చెప్పారు. తాజా మహానాడు లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత, నాలుగు దశాబ్ధాల సుధీర్ఘ అనుభవమున్న నారా చంద్రబాబు నాయుడు తీరు ప్రవర్తన ఆయన స్థాయికి తగ్గట్టు లేదని కనీస హుందాతనం కూడా లేదని, ఆయన ఏదో డీప్-డిప్రెషన్ ను లోపల దాస్తూ పైకి మాత్రం ఊసరవెల్లి కూడ సిగ్గు పడే లాగా మాట్లాడుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు.
మహానాడు వేదికగా చంద్రబాబునాయుడుతో సహా, కొందరు టిడిపి నేతలు, అందులో కొందరు సుధీర్ఘ రాజకీయ అనుభవము ఉన్నవారు కూడా, ఆయనే చెప్పినట్లు మతి తప్పి గతి తప్పి, కేంద్ర ప్రభుత్వంపై, బిజెపిపై, చేసిన విమర్శలు వారి హుందాతనాన్ని మరచి మాట్లాడినట్లు కనిపిస్తున్నాయని జీవీఎల్ నరసింహారావు బుధవారం నాడు స్పందించారు. మాకు వారిలాగానే స్పందించాల్సిన అవసరం తప్పట్లేదని, విజయవాడలో నిర్వహించింది మహనాడు కాదు, దగానాడు అని ఆయన ఎద్దేవా చేశారు.
గుజరాత్ రాష్ట్రానికి కేంద్రం పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేసిందని చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేశారని, 2014కు ముందు కేంద్రంలో అధికారంలోకి ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం మంజూరు చేసిన ప్రకారంగానే గుజరాత్ “ఇండస్ట్రీయల్ సిటీ” అభివృద్ది అవుతోందన్నారు. అది పాత ప్రోజెక్ట్ కొన సాగింపే గాని కొత్త ప్రతిపాదన కాదని స్పష్టం చేశారు.
కేంద్రంలో తమ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ రాష్ట్రంలో మూడు సిటీలను "ఇండస్ట్రీయల్ సిటీలు" గా డెవలప్ చేస్తున్నామని ఆయన చెప్పారు. కేంద్రం గుజరాత్ రాష్ట్రానికి అదనంగా నిధులు ఇస్తూ, ఏపీని అన్యాయం చేస్తోందని చంద్రబాబునాయుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన చెప్పారు. తప్పుడు ప్రచారం చేసినందుకుగాను చంద్రబాబు నాయుడు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని లేదా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రత్యేక ప్రతిపత్తి హోదా కాకుండా ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చిన సమయంలో ప్రత్యేక హోదా కంటే ఎక్కువగా కేంద్ర ప్రభుత్వం నుండి తాము సాధించామని శాసనసభలో చంద్రబాబు నాయుడు దృవీకరించారని ఆయన చెప్పారు. ఇప్పుడేమో ప్రత్యేక హోదా గురించి కన్వీనియంట్ గా మాట మార్చేసి యూటర్న్, ట్విస్ట్ లు ఇస్తున్నారని, వారిప్పుడు బాబును అర్ధంచేసుకునే పనిలో పడ్డారని ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాబును క్షమించరని ఆయన అన్నారు.
కేంద్రం ఇచ్చిన నిధుల్లో అనేక అవకతకవలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాల్పడిందన్నారు. నిధులు ఖర్చు చేయకుండానే ఖర్చు చేసినట్టుగా వినియోగ దృవపత్రాలు (యూసీలు) సమర్పించారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అవినీతిని తామెప్పటికీ సమర్ధించేందుకు సిద్దంగా లేమని చెప్పారు, ఇచ్చిన నిధుల్లో ప్రతి పైసాకు లెక్కలు చెప్పాల్సిందేనని ఆయన చెప్పారు.
నిధుల వినియోగ లెక్కలు లేకపోవటానికి లేదా చెప్పక పోవటానికి చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని నడుపు తున్నారా? మాపియా ప్రభుత్వాన్ని నడుపు తున్నారా? ఇక్కడ ప్రతిదానికీ అకౌంటబిలిటీ, బాధ్యత ఉంటుందని — నిధులిచ్చిన కేంద్రానికి కూడా ఖర్చు అర్ధం కావలసిన అవసరముందని జీవీఎల్ నరసింహరావు చంద్రబాబుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.
కేంద్రం నుండి వచ్చే నిధులని ఎన్నికల ఫండ్ కాదని, ఎన్నికల ఫండ్ గా ఉపయోగించుకోవడాన్ని తాము సహించడానికి సిద్దంగా లేమని ఆయన చెప్పారు. ఈనాడు తమపై మాట మార్చి లేని పోని నిందలు వేస్తున్న చంద్రబాబు బిజెపితో పొత్తు కోసం పడిన తపన వర్ణనాతీతమన్నారు. తమ పార్టీతో పొత్తు కోసం టిడిపి నేతలు ఏ రకంగా తాపత్రయపడ్డారనే విషయమై, గత ఫోన్ రికార్డులు బట్టబయలు చేస్తాయని జీవీఎల్ నరసింహారావు చెప్పారు.
2014 ఎన్నికలకు ముందు టిడిపి నేతలు తమ పార్టీ నేతలతో చేసిన సంభాషణలను వింటే బిజెపితో పొత్తు కోసం టిడిపి ఎంతగా అర్రులు చాచిందీ, ఎంతగా ఆసక్తిని కనబర్చిందీ అంతా అర్ధం అవుతోందన్నారు.
ఎపి ప్రబుత్వం ప్రజలలో విపరీతమైన వ్యతిరేకత ఎదుర్కోంటోందని బిజెపి ఆ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు కూడా తెలుసునని , అందుకే ప్రజల వద్దకు వెళ్లకుండా ప్రబుత్వ ఖర్చుతో దీక్షలు నడుపుతూ ప్రజలను మోసం చేయాలని యత్నిస్తున్నారని ఆయన అన్నారు. కేంద్రం ఇచ్చిన నిదులకు సంబందించి ఎంత దుర్వినియోగం అవుతోందో అర్దం అవు తోందని ఆయన అన్నారు. రాజదానిలో ఏమి నిర్మించారన్నదానిపై అదికారులు కూడా వెళ్లి వచ్చారని వారి నివేదికలు కూడా వస్తాయని ఆయన అన్నారు.
యుసిల గురించి, నిధుల వినియోగం గురించి ఎవరైనా ప్రశ్నించవచ్చని ఆయన అన్నారు. కేంద్రం ఇచ్చే నిదులు తెలుగు దేశం ఎన్నికల నిదులు కాదని జివిఎల్ అన్నారు.