సోమవారం (మే 28, 2018) దేశ వ్యాప్తంగా నాలుగు లోక్సభ, పది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. నేడు లోక్సభ, అసెంబ్లీ ఉపఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడనున్నాయి. ఇప్పటికే యూపీలోని కైరానా, మహారాష్ట్రలోని పాల్గర్, భండారా-గోండియా సహా పలుచోట్ల ఓట్ల లెక్కింపు మొదలయ్యింది. కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ సహా విపక్షాలన్నీ ఆసక్తిగా ఎదురు చూస్తున్న కైరానాలో అధికార బీజేపీ ఆదిలోనే వెనకబడింది.
నాలుగు రౌండ్లు కౌంటింగ్ పూర్తికాగా బీజేపీ అభ్యర్థి మృగాంక సింగ్కు 8,029 ఓట్లు రాగా, విపక్షాలు బలపర్చిన ఆర్ఎల్డీ అభ్యర్థి తబస్సుం హాసన్ 12,790 ఓట్లతో ముందంజలో ఉన్నారు. ఇక కర్ణాటక నెంబర్ గేమ్లో కాంగ్రెస్ మరింత సంఖ్యాబలం పెంచుకునే దిశగా దూసుకెళ్తోంది. ఆర్ఆర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్న ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ తిరుగులేని ఆధిక్యంతో కొనసాగుతోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి మునిరత్న 16,581 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
బీజేపీ అభ్యర్థి తులసి మునిరాజుకు 7,901 ఓట్లు రాగా, జేడీఎస్ అభ్యర్థి జీహెచ్ రామచంద్ర 3,606 ఓట్లతో మూడో స్థానంలో ఉన్నారు. ఇటీవల యూపీలో జరిగిన గోరఖ్పూర్, ఫుల్పూర్ లోక్సభ ఉపఎన్నికల్లో ఘోర పరాభవం చవిచూసిన బీజేపీ ఈసారైనా పుంజుకుంటుందా లేక విపక్షాలు కైరానా కూడా కైవసం చేసుకుని హ్యాట్రిక్ సాధిస్తాయా అన్నది ఆసక్తికరంగా మారింది.