ఏపీలో నిన్నమొన్నటి వరకు అధికార టీడీపీకి మిత్రపక్షంగా అంటకాగిన బీజేపీ ఇప్పుడు అదే పార్టీకి బద్ధ శత్రువుగా మారిపోయింది. టీడీపీకి ఎలాగైనా చెక్ చెప్పాలని బీజేపీ పెద్దలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఏపీకి ఇచ్చిన హామీలు అములు చేయడంలో కేంద్రం మోసం చేసిందని చంద్రబాబు చెపుతుంటే, తాము ఇచ్చిన నిధుల లెక్కలు చెప్పడం లేదని బీజేపీ ఇలా పరస్పర వైరుధ్యంతో విడిపోయాయి. దేశంలో అన్ని రాష్ట్రాలను టార్గెట్ చేస్తూ వస్తోన్న బీజేపీ ఈ క్రమంలోనే ఏపీ, తెలంగాణ మీద కూడా కాన్సంట్రేషన్ చేసింది.
ఏపీలో బీజేపీ ప్రక్షాళన చేపట్టిన పార్టీ అధిష్టానం ఇప్పటికే ఆ పార్టీ ఏపీ శాఖ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీ నారాయణను నియమించి పెద్ద సంచలనానికే తెరదీసింది. కొన్ని యేళ్ల తర్వాత ఏపీ బీజేపీ పగ్గాలు వెంకయ్య నాయుడు వర్గానికి సంబంధం లేకుండా, ఓ సామాజిక వర్గం హస్తం నుంచి బయటకు వచ్చాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు వచ్చే ఎన్నికలను ఎదుర్కొనేందుకు రెడీ అవుతోన్న బీజేపీ ఇక్కడ సీఎం అభ్యర్థి విషయంలో కూడా పక్కా క్లారిటీతో ఉన్నట్టు జాతీయ రాజకీయ వర్గాల్లో కథనాలు వస్తున్నాయి.
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ బీజేపీలో చేరనున్నారా.. ఏపీకి బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఆయనేనా అంటే అవునన్న చర్చలే అటు బీజేపీ జాతీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నోటి వెంట వచ్చిన ఓ మాట ఇప్పుడు ఈ చర్చకు దారి తీసింది. వచ్చే ఎన్నికల్లో ఏపీ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి లక్ష్మీనారాయణేనా ? అన్న ప్రశ్నకు కన్నా స్పందిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోడీతో పాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఎవరిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిర్ణయిస్తే వారు అవుతారని చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో ఏపీలో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పిన కన్నా... తమ పార్టీపై ఏపీ ప్రజల్లో ఉన్న అపోహలు తొలగిస్తామని చెప్పారు. ఇటు కన్నా చేసిన వ్యాఖ్యలు, అటు జాతీయ మీడియాలో కథనాలు, బీజేపీ జాతీయ నాయకత్వంలో లక్ష్మీనారాయణపై జరుగుతోన్న చర్చలతో పాటు ఇటీవల ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో లక్ష్మీ నారాయణ పాల్గోవడం కూడా ఇందుకు బలాన్ని ఇచ్చింది. మహారాష్ట్ర ఐఏఎస్ కేడర్లో పని చేస్తూ స్వచ్ఛందంగా వీఆర్ఎస్ తీసుకున్న జేడీ ప్రస్తుతం జిల్లాల పర్యటనలు చేస్తున్నారు.
ఆయన త్వరలోనే బీజేపీలో చేరతారన్న వార్తలు ఏపీ రాజకీయ వర్గాల్లో ఇప్పటికే బాగా స్ప్రెడ్ అవుతున్నాయి. తన పొలిటికల్ ఎంట్రీపై ఆయన క్లారిటీ ఇవ్వకపోయినా ఆయన గతంలో మాత్రం వ్యవసాయశాఖా మంత్రిగా పని చేయాలని ఉందని చెప్పారు. ప్రస్తుతం ఏపీలో పర్యటిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం వచ్చే ఎన్నికల్లో ఏపీలో లక్ష్మీనారాయణను బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఎన్నికలకు వెళ్లి టీడీపీని దెబ్బకొట్టాలని చూస్తోన్న బీజేపీ ఇక్కడ పార్టీకి మెరుగైన ఫలితాలు రాకపోతే ఆయన్ను రాజ్యసభకు తీసుకుని కేంద్రమంత్రిగా చేసే ఛాన్సులు ఉన్నట్టు తెలుస్తోంది.