ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటి నుంచే వరాలు ప్రకటించే పనిలో పడ్దారు. గత ఎన్నికల్లో ఇచ్చిన రుణమాఫీ హామీని అమలు చేయలేక.. వాటిలో కొర్రీలు పెడుతూ వీలైనంతంగా లబ్ధిదారులను తగ్గించి విమర్శల పాలవుతున్న విషయం తెలిసిందే! ఇప్పుడు ఇదే సూత్రాన్ని నిరుద్యోగ భృతికీ ఆపాదించేశారు. ఫలితంగా ముందుగా చెప్పిన రూ.2వేలు.. సగానికి తగ్గి రూ.వెయ్యి అయింది. 2.10కోట్ల నిరుద్యోగులు కాస్తా 10లక్షలకు తగ్గిపోయారు. `బాబు వస్తే జాబు.. ఐదేళ్లలో లక్షల ఐటీ ఉద్యోగాలు` గత ఎన్నికల సమయంలో టీడీపీ నాయకులు యువతను ఆకట్టుకునేందుకు వేసిన అస్త్రాల్లో ఇదీ ఒకటి. అయితే దీనికి మించి టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్లస్ అయిన హామీ.. నిరుద్యోగ భృతి! అయితే నాలుగేళ్లలో ఒక్కసారి కూడా దీనిపై మాట్లాడని చంద్రబాబు.. సడన్గా నిరుద్యోగ భృతి ప్రకటించడమంటే.. అది ఎన్నికల ముందు బిస్కెట్ లాంటిదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అలవి కాని హామీలు ఇచ్చి టీడీపీ ప్రభుత్వం ఇప్పటికే చిక్కుల్లో పడిపోయింది. డ్వాక్రా రుణమాఫీ, రైతు రుణమాఫీ వంటివి చేయలేక చేతులత్తేసిన సర్కారు.. వీటికి అడపాదడపా నిధులు మంజూరు చేసి మరిచిపోలేదని గుర్తుచేస్తోంది. ఇదే సమయంలో నిరుద్యోగ భృతిపై మాత్రం సర్కారు ఇప్పటివరకూ నోరుమెదపలేదు. నిరుద్యోగ భృతి ఎంత ఇవ్వాలనే అంశంపై, ఎంత మందికి ఇవ్వాలనే విషయాలపై కసరత్తు చేస్తున్నామని చెప్పడమే తప్ప.. ఇప్పటికీ స్పష్టమైన ప్రణాళిక రూపొందించలేదు. ప్రస్తుతం ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈ అంశాన్ని హడావుడిగా తెరపైకి తెచ్చారు. నాలుగేళ్లలో ఎన్నోసార్లు గంటలగంటలు క్యాబినెట్ సమావేశం నిర్వహించినా దీని ఊసెత్తని చంద్రబాబు. ఇప్పుడు నిరుద్యోగ భృతి రూ.1000 ఇస్తామని ప్రకటించారు.
నిరుద్యోగ భృతి పథకాన్నయితే ప్రకటించారు కానీ ఇందులో అన్నీ లోపాలేనని చెబుతున్నారు. తొలుత రూ.2వేలు ఇస్తామన్న చంద్రబాబు.. దాన్ని అమాంతం సగానికి తగ్గించేశారు. అంతేకాదు.. రాష్ట్రంలో 2కోట్ల 10లక్షల మంది నిరుద్యోగులున్నారని సాక్షాత్తూ లెక్కలు చెబుతున్నాయి. బాబు మాత్రం 10 లక్షల మంది యువతకు భరోసా అంటూ హోర్డింగ్ లు పెట్టుకుంటున్నారు. సవాలక్ష కండిషన్లు పెట్టి మిగతా 2కోట్ల మందికి స్మార్ట్ గా హ్యాండ్ ఇచ్చారన్నమాట.
కేవలం డిగ్రీ పూర్తయిన వ్యక్తినే నిరుద్యోగిగా లెక్కిస్తారట. ఐటీఐ చేసి కొన్ని లక్షల మంది ఉపాధి లేక అల్లాడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువమంది చేసే కోర్సు ఐటీఐ. చంద్రబాబు లెక్క ప్రకారం వీళ్లెవరూ నిరుద్యోగులు కారట. కేవలం వీళ్లకు ట్రయినింగ్ ఇచ్చి చేతులు దులుపుకుంటారంట. పాలిటెక్నిక్ చేసే వాళ్లు కూడా ఈ కేటగిరీ కిందకే వస్తారు.
డిగ్రీ పూర్తిచేసిన వాళ్లు.. భృతి కోసం వెయిట్ చేస్తూ కూర్చోడు కదా. దొరికినంతలో ఏదో ఒక ఉపాధి చూసుకుంటాడు. అలాంటి వాళ్లకు కూడా నిరుద్యోగ భృతి కట్. డిగ్రీ పూర్తిచేసినప్పటికీ ప్రైవేట్ పరిశ్రమల్లో పనిచేస్తుంటే భృతి ఇవ్వరట. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా ఇదే వర్తిస్తుంది. ఒక ఇంట్లో డిగ్రీ చేసిన వాళ్లు ఒకరి కంటే ఎక్కువ మంది ఉంటే.. నిరుద్యోగ భృతి ఒకరికే ఇస్తారట. ఇలా అనేక వడపోతలు పోస్తూ.. చివరికి 10లక్షల మంది మాత్రమే అర్హులని తేల్చారు. వాళ్లకు రూ.1200కోట్లు కేటాయించామని డప్పుకొట్టారు. ఈ పథకంలో నమోదు చేసుకోవడానికి ఎలాంటి గైడ్ లైన్స్ రాలేదు. అంటే ఈ ప్రక్రియ ప్రారంభమయ్యేసరికి మరికొన్ని నెలలు పడుతుందంటున్నారు. ఈలోగా ఎన్నికలు వచ్చేస్తాయి. అంటే ఏ ఒక్కరికీ నిరుద్యోగ భృతి కేవలం మాటలకు, సమావేశాలకు పరిమితమట.