తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కొద్దిరోజులుగా విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.. పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న సందర్భంగా ఆయనకు అనూహ్యంగా ప్రజల నుంచి చుక్కెదురవుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు సమావేశాలు, సభల్లో కడియంకు ఏదో ఒక రూపంలో ప్రతిఘటన ఎదురవుతోంది. అయితే ఇక్కడే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అవన్నీ కూడా అనుకోకుండా జరుగుతున్నాయా..? లేక ఎవరైనా ముందస్తుగా అనుకునే అలా చేయిస్తున్నారా..? అన్నదానిపై కడియం అనుచరులు తలలు పట్టుకుంటున్నారు.
కడియం చుట్టూ ఏదో జరుగుతోందనే అనుమానాలూ వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయనను వివాదాస్పదం చేయడానికి కొందరు సొంతపార్టీ నాయకులే కుట్రలు పన్నుతున్నారనే టాక్ వినిస్తోంది. నిజానికి ఎంపీ పదవి రాజీనామా చేసి, ఉప ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత కడియం శ్రీహరి ఎక్కువగా వరంగల్లోనే ఉంటున్నారు. ఇదే సమయంలో ఆయన విద్యాశాఖ మంత్రిగా కూడా బాధ్యతులు చేపడుతున్నారు. అయితే డిప్యూటీ సీఎం హోదాలో ఏ నియోజకవర్గానికి కూడా స్వతంత్రంగా వెళ్లలేని పరిస్థితి ఉంది. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పిలిస్తేనే వెళ్తున్నట్లు తెలుస్తోంది.
ఇక ఆయనను పిలువడానికి ఎమ్మెల్యేలు ఇష్టపడడంలేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే కడియంను ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఆహ్వానిస్తున్నారు. ఇదేసమయంలో జిల్లాలో పలువురు ఎమ్మెల్యేలతో కడియం కూడా గ్రూప్ ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఆయా నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలకు కడియం కారణమయ్యారనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఆ మధ్య హన్మకొండలో మానుకోట ఎమ్మెల్యే శంకర్నాయక్, ఎంపీ సీతారాంనాయక్తోపాటు పలువురు కార్యకర్తలతో కడియం రహస్యంగా సమావేశం నిర్వహించినట్లు కూడా ప్రచారం జరిగింది.
కొద్దిరోజుల క్రితం మానుకోట నియోజకవర్గంలో కడియం శ్రీహరి పర్యటించారు. ఇక్కడే ఓ కార్యకర్తల ఆత్మహత్యకు యత్నించాడు. తనకు అన్యాయం చేశారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. మానుకోట నియోజకవర్గం సిట్టింగ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్నాయక్ కడియం అనుచరుడేనని టాక్. నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు వ్యతిరేక వర్గం కూడా ఉంది. ఇది ఆవర్గం పనేనని పలువురు నాయకులు అప్పట్లో అనుమానాలు వ్యక్తం చేశారు. ఇక జనగామ నియోజకవర్గంలో రైతుబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కడియం శ్రీహరి ఊహించని షాక్లు తగిలాయి.
మీటింగ్లో మాట్లాడుతూ.. నియోజకవర్గంలో చెరువులన్నింటినీ గోదావరి జలాలతో నింపుతున్నామని చెప్పగా.. వెంటనే ఓ వ్యక్తి లేచి తమ ఊరి చెరువు నిండలేదని చెప్పడంతో ఆయన కంగుతిన్నారు. అలాగే మరో గ్రామంలో రైతుబంధు కార్యక్రమంలో ఓ వ్యక్తి లేచి.. లంచాలు తీసుకునే రెవెన్యూ అధికారులు పట్టాదారు పాస్పుస్తకాలు ఇస్తున్నారని ఆరోపణలు చేయడంతో కడియం సైలెంట్ అయిపోయారు.