కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వంపై ఏపీ సీఎం చంద్రబాబు గత కొన్నాళ్లుగా రెచ్చిపోతున్నారు. బాబు ఎక్కడ ఏవేదిక ఎక్కినా.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. మోడీ ఏపీకి ఏమీ ఇవ్వలేదని, బీజేపీని ఓడించాలని ఆయన పెద్ద ఎత్తున పిలుపు ఇస్తున్నారు. అంతాబాగానే ఉంది., అయితే, మోడీ ఏపీకి ఎంతో ఇచ్చారని బీజేపీ నేతలు మరోపక్క బాకా ఊదుతున్నారు. మొత్తంగా కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన వాటిలో 85% దాకా వచ్చాయని, కేవలం కొద్దిపాటి సాయం మాత్రమే అందాల్సి ఉందని చెబుతున్నారు. మరి ఈ క్రమంలో ఎవరి మాటలను నమ్మాలి? అనే ప్రధాన ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఈ క్రమంలో అసలు ఏపీకి మోడీ ఏం చేశారో? ఏమిచ్చారో చూద్దాం..!
అక్షరాలా లక్ష కోట్ల రూపాయలు! హోదా/ప్యాకేజీ, ఇతర విభజన హామీల కింద ప్రత్యేకంగా కేంద్రం నుంచి అందాల్సి న, అందుతుందని రాష్ట్రం ఆశించిన సహాయమిది! ఇప్పటికి నాలుగేళ్లు గడిచిపోయాయి. అంటే... దామాషా ప్రకారం కనీసం రూ.80 వేల కోట్లు రాష్ట్రానికి సహాయంగా అంది ఉండాలి. కనీసం ఈ నాలుగేళ్లలో 40వేల కోట్లు వచ్చి ఉండాలి. కానీ... కేంద్రం నవ్యాంధ్రకు ప్రత్యేకంగా చేసిన సహాయం కేవలం 13,520 కోట్లు! అదేసమయంలో నవ్యాంధ్రకు ఈ నాలుగేళ్లలో కేంద్రం నుంచి రూ.1.86 లక్షల కోట్లు రావడం నిజమే. కానీ... ఇందులో విభజన హామీల నేపథ్యంలో ప్రత్యేకంగా అందిన సహాయం రూ.13,520 కోట్లు మాత్రమే. మిగిలిన 1.74 లక్షల కోట్లు నిబంధనల ప్రకారం అన్ని రాష్ట్రాలకు వచ్చినట్లుగానే... నవ్యాంధ్రకూ దక్కాయి.
ఈసారి కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంటును రూ.50,500 కోట్లుగా పేర్కొన్నారు. కానీ... గత నాలుగేళ్లలో వచ్చిన గ్రాంటు మొత్తం రూ.55,800 కోట్లు కావడం గమనార్హం. ఆ ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు ఉన్న 10 నెలల సమయంలో ఏర్పడిన రెవెన్యూలోటు రూ.16,000 కోట్లను కేంద్రమే భర్తీ చేయాలి. కానీ... రకరకాల గిమ్మిక్కులతో చేసి లోటు లెక్కలకు భారీగా కోత విధించారు. ఇప్పటికి ఈ పద్దు కింద రూ.3980 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఇక ఇవ్వబోయేదీ పెద్దగా ఉండదు. ఇక... అమరావతి నిర్మాణానికి రూ.3,500 కోట్లు ఇవ్వాలని విభజన చట్టంలో పేర్కొన్నారు. కేంద్రం రూ.1500 కోట్లు మాత్రమే ఇచ్చింది. విజయవాడ, గుంటూరులో భూగర్భ డ్రైనేజీ కోసం ఇచ్చిన వెయ్యి కోట్లను కూడా కలిపి రాజధానికి రూ.2500 కోట్లు ఇచ్చామని చెప్పుకొంటోంది.
ఇక... ఈ నాలుగేళ్లలో వెనుకబడిన జిల్లాలకు రూ.1400 కోట్లు రావాలి. కానీ... 1050 కోట్లు మాత్రమే వచ్చాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 9వ తేదీన రూ.350 కోట్లు ఇచ్చినట్లే ఇచ్చి.. ప్రధాని కార్యాలయం అనుమతి లేదంటూ ఫిబ్రవరి 15వ తేదీన మొత్తం వెనక్కి తీసేసుకున్నారు. మొత్తంగా ఏపీకి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సాయం ఇతమిత్థంగా ఇదే! మరి ఈ క్రమంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం అనేది ఏ ప్రభుత్వానికైనా సాధ్యమేనా? అనేది ఇప్పుడు ప్రధానంగా వేధిస్తున్న ప్రశ్న. మరి మోడీ ఇలా చేస్తే.. ఏ ప్రభుత్వానికైనా మండదా? సీఎం చంద్రబాబుసైతం ఇన్నాళ్లు ఓపిక పట్టినా ఎన్నికల సమయం వచ్చే సరికి రెచ్చిపోతున్నారనడంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదుగా!!