ఒకప్పుడు పవన్ కళ్యాన్ అంటే మెగాస్టార్ కి తమ్ముడు, మంచి నటుడు అనే అభిప్రాయం మాత్రమే ఉండేది అయితే తన నటనతోనే కాదు ప్రత్యేకమైన వ్యక్తిత్వం వల్ల,ఆయన భిన్నమైన మనస్తత్వం వల్ల అభిమానులకు మరింత చేరువయ్యాడు. జనసేన పార్టీ స్థాపించి ప్రజల తరుపు నుంచి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ గత కొన్ని రోజులుగా పర్యటన కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా పవన్ కల్యాణ్ పర్యటనను పురస్కరించుకుని ఫ్లెక్సీలు కడుతుండగా విషాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతానికి గురై ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. విశాఖ జిల్లా పాయకరావుపేటలో ఈ విషాదం చోటుచేసుకుంది.
తమ అభిమాన హీరో రాకను పురస్కరించుకుని తునికి చెందిన తోళెం నాగరాజు, పాయకరావుపేటకు చెందిన శివ కలిసి స్థానిక సాయిమహల్ జంక్షన్ వద్ద స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగలడంతో విద్యుదాఘాతానికి గురై ఇద్దరూ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటనతో పాయకరావుపేటలో విషాదం నెలకొంది.