గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో వరుసగా పవడ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే పడవ ప్రమాదాలు ఎన్ని జరగుతున్న ప్రభుత్వం మాత్రం అప్పటికప్పుడు కొన్ని తాత్కాలిక చర్యలు మాత్రమే తీసుకుంటూ..తర్వాత షరా మూమూలే అన్న విధంగా సాగుతుంది. తాజాగా పులికాట్ సరస్సులో పెను ప్రమాదం తప్పింది.
వివరాల్లోకి వెళ్తే, ఇరకం దీవిలో జరుగుతోన్న పొన్నియమ్మ రథోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. కాగా ఇరకం-భీములవారిపాలెం మధ్య భక్తులను తరలించేందుకు మత్స్యకారులు పడవలను నడుపుతున్నారు. భీములపాలెం రేవుకు 30 మంది భక్తులతో తిరిగి వస్తున్న ఓ పడవ ప్రమాదానికి గురైంది. ఓ చిన్న పడవలో లెక్కకు మించిన సంఖ్యతో భక్తులు ఎక్కడం..అందులోకి నీరు చేరడంతో రేవు సమీపంలోకి వచ్చే సమయంలో పడవ మునిగిపోయింది.
అదృష్టం కొద్ది ఆ పడవ ఒడ్డుకు చేరడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయ్యింది. దీన్ని గమనించి ఇతర పడవల నిర్వాహకులు వెంటనే ప్రమాద స్థలికి వెళ్లి, అందరినీ ఒడ్డుకు తరలించారు. ఇదే ప్రమాదం సరస్సు మధ్యలో జరిగి ఉంటే పెను ప్రమాదం సంభవించి ఉండేది. జరిగిన ఘటనతో భక్తులంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు.