ఆర్జేడీ బ్రదర్స్ మధ్య ఆధిపత్య పోరు రాజుకుంది. మొన్న జరిగిన ఉప ఎన్నికల తర్వాత అన్నదమ్ముల మధ్య మరింత దూరం పెరిగినట్లు కనిపిస్తోంది. తండ్రి లాలూప్రసాద్ యాదవ్ జైలుపాలైన పార్టీ బాధ్యతలను తన భుజస్వందాలపై వేసుకుని లాలు చిన్నకుమారుడు తేజస్వియాదవ్ నడిపిస్తున్న తీరు జాతీయ పార్టీల నేతలను సైతం ఆకర్షించింది. మొన్న జరిగిన ఉప ఎన్నికల్లోనూ తన వ్యూహచతురతతో పార్టీని విజయతీరాలకు చేర్చారు తేజస్వియాదవ్. జోకిహాట్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో జేడీయూ అభ్యర్థిని ఓడించి, ఆర్జేడీ అభ్యర్థిని గెలిపించుకున్న తీరుతో దేశవ్యాప్తంగా ఆయన పేరు మార్మోగింది.
అయితే ఆర్జేడీ బ్రదర్స్ ఆధిపత్యపోరుతో వచ్చే ఎన్నికల్లో బీజేపీ-జేడీయూ కూటమికి లాభం జరుగుతుందనే టాక్ వినిపిస్తోంది. ఇంత చిన్నవయస్సులోనే పార్టీ బాధ్యతలు చేపట్టి, ప్రధాని మోడీ-అమిత్షా ద్వయాన్ని, జేడీయూ నేత, ముఖ్యమంత్రి నితీశ్కుమార్లను తట్టుకుని పార్టీని విజయతీరాలకు చేర్చిన తేజస్వియాదవ్పై జాతీయ నేతలు, ఇతర ప్రాంతీయ పార్టీల నేతలు కూడా ప్రశంసల వర్షం కురిపించారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా జేడీఎస్ నేత కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి హాజరైనప్పుడు కూడా ఆయన హుందాగా వ్యవహరించారు. యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి తదితర జాతీయస్థాయి నేతలతో సన్నిహితంగా మెలిగారు.
ఈ క్రమంలో పలువురు నేతలు తండ్రి లాలూ రాజకీయ వారసత్వాన్ని తేజస్వీ అందిపుచ్చుకుంటాడని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే తేజస్వియాదవ్ అన్న మాజీ డిప్యూటీ సీఎం తేజ్ప్రతాప్ యాదవ్ గుర్రుగా ఉన్నారు. అయితే ఆయన శనివారం తన తమ్ముడు తేజస్వియాదవ్తో సమావేశం అయిన తర్వాత తేజ్ ప్రతాప్ వ్యూహాత్మకంగా మాట్లాడారు. ఆర్జేడీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు విచారం కలిగిస్తున్నాయనీ... కొన్ని సంఘ విద్రోహశక్తులు పార్టీలోకి ప్రవేశించి, ఆర్జేడీని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయనీ ఆరోపించారు.
కొందరు భ్రష్టులను తేజస్వీ పార్టీలోకి తీసుకున్నాడనీ... ఇప్పుడు వారు తమ మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారనీ.. అయినా తమ్ముడిపై చాలా ప్రేమ ఉందని తేజ్ప్రతాప్ అన్నారు. అయితే... ఇక్కడే తేజ్ప్రతాప్ మరో ట్విస్ట్ ఇచ్చారు. తమ మధ్య అంతరం పెరిగిపోతోందని నర్మగర్భంగా చెప్పారు. తాను ఫోన్ చేస్తే తన కాల్స్ను తేజస్వీ స్వీకరించడంలేదని ఆయన చెప్పడం గమనార్హం.